తెలంగాణ ఉద్యమంలో ఓయు, కేయూ: అదే దారిలో.. ఏపీ వర్సిటీలపై జగన్ కన్ను!!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకొని ప్రత్యేక హోదా ఉద్యమాన్ని బలోపేతం చేసి, తద్వారా ప్రయోజనాన్ని ఆశిస్తున్నారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థులు మంగళవారం నాడు స్థానిక పిఎల్ఆర్ కన్వెన్షన్ హాలులో 'రాష్ట్రానికి ప్రత్యేక హోదా - ఉద్యోగ అవకాశాలు - రాష్ట్రాభివృద్ధి' అనే అంశంపై యువభేరీ సదస్సు నిర్వహించగా.. జగన్ ఇందులో విద్యార్థులను ఆకట్టుకునే ప్రసంగం చేశారు.
తెలంగాణ ఉద్యమాలకు హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయాలు వేదికలుగా నిలిచాయి. ఎప్పటికప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా ఉంచడంలో ఈ రెండు విశ్వవిద్యాలయాల పాత్ర మరువలేనిది.
తెలంగాణ రావడంలో విద్యార్థుల పాత్ర ఎవరూ కొట్టిపారేయలేరు. ఏ పార్టీ లేదా ఏ సంస్థ అయినా తెలంగాణ ఉద్యమం పేరు చెప్పినా... ఓయు, కేయు పేర్లు తప్పకుండా ప్రస్తావించాల్సిందే. ప్రస్తుతం తెలంగాణ సీఎంగా కేసిఆర్ ఉన్నారంటే.. ఉద్యమంలో విద్యార్థుల పాత్రవల్లేనని చెప్పవచ్చు.
నాడు, తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఎంత ముఖ్యమో... నేడు ఏపీకి ప్రత్యేక హోదా అంతే ముఖ్యం అని చెప్పవచ్చు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ అని చెబుతున్నప్పటికీ.. హోదా ఉంటేనే ఏపీ అభివృద్ధి అని, హోదా లేకుండా ఎంత ప్యాకేజీ ఇచ్చినా అభివృద్ధి అంతగా కనిపించదని విపక్షాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రత్యేక హోదా కావాల్సిందేనని చెబుతున్నాయి. హోదాతో ఏపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఉద్యమిస్తామని వైసిపి, కాంగ్రెస్ చెబుతున్నాయి.
త్వరలో జగన్ హోదా కోసం దీక్ష కూడా చేయనున్నారు. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, వ్యూహాత్మకంగానే ప్రత్యేక హోదా అంశాన్ని వర్సీటీల స్థాయి నుంచి బలోపేతం చేయాలని భావిస్తుండవచ్చునని అంటున్నారు.
ఇప్పటికే యువత, విద్యార్థుల్లోనొ హోదా లేకుంటే ఏపీ అభివృద్ధిలో వెనుకబడుతుందని ఆందోళన చెందుతున్నారు. నాడు, తెలంగాణ ఉద్యమాన్ని ఓయూ, కేయులు సజీవంగా నిలిపినట్లు... ఏపీ వర్సిటీలు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నడిపిస్తాయా అనేది చూడాలి.
అయితే, వైసిపి మాత్రం ఆ దిశలో ఆలోచించినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ప్రత్యేక హోదా కోసం విద్యార్థులు కూడా కలిసి రావాలని జగన్ మంగళవారం పిలుపునిచ్చారు. హోదా గురించి మొత్తం తెలుసుకోవాలి, దానిని మరో నలుగురికి చెప్పాలని ఆయన సూచించారు. రిషికేశ్వరి మృతి ఘటన పైన కూడా వైసిపి ఎమ్మెల్యే రోజా నేతృత్వంలో నాగార్జున వర్సిటీకి వెళ్లింది.