షాకింగ్:ఎపికి ప్రత్యేక హోదా రాదని తేల్చేసిన లోక్ సత్తా జెపి
లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాదని జెపి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిణామాలను బట్టి ఎపికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదని ఆయన తేల్చేశారు. ఇక ఇదే విషయాన్ని ఎపి బిజెపి నేతలు ఎప్పట్నుంచో చెబుతున్నప్పటికీ లోక్ సత్తా అధినేత జెపి నోటి వెంట ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
జెపి ఆధ్వర్యంలో ఒక స్వతంత్ర నిపుణుల బృందం ఆంధ్రప్రదేశ్ విభజన హామీలపై సమీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ బృందంతో సమావేశం అనంతరం జెపి మీడియాతో మాట్లాడారు. ఎపి రాజకీయ పార్టీలు ఓట్ల రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఎపికి ప్రత్యేక హోదా బదులుగా దానికి సమానంగా ఎంత లబ్ది చేకూరుతుందో అంచనా వేసి ఆ మొత్తం కేంద్రం సాయం చేయాలని ఆయన సూచించారు.
ఇక తన ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్వతంత్ర నిపుణుల బృందంతో సమావేశంలో జెపి...రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చట్టపరంగానూ, పార్లమెంట్ లోనూ ఇచ్చిన హామీల్ని భారత ప్రభుత్వం ఏమేరకు నెరవేర్చిందీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తూ వివాద పరిష్కారానికి తోడ్పాటునందించే పౌరసమాజంగా వ్యవహరించడం, ఇతరత్రా అంశాలను చర్చించారు. ఈ కమిటీలో మాజీ ఐఏఎస్ పద్మనాభయ్య, ప్రొఫెసర్ గలాబ్, రాఘవా చారీ, శాంతాసిన్హా, హెచ్ఏ దొర తదితర ప్రముఖులు ఉండటం గమనార్హం.
పవన్ కళ్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్సీ) పైన మొదట్లో చూపిన శ్రద్ధ ఆ తర్వాత చూపడం లేదని...ఎపికి నిధుల విషయమై ముందు హడావుడి చేసి, ఇప్పుడు సైలెంట్ అయ్యాడని లోక్ సత్తా అధినేత జెపి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. నిధుల వ్యవహారంపై జెఎఫ్సి నివేదిక ఇచ్చిన తర్వాత దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అందుకే విడిగా ఓ స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేశానని జెపి చెబుతున్నారు.