సంక్రాంతి రద్దీ: తిరుగు ప్రయాణానికి 250 బస్సులు, 35 ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: తెలుగు వారి పండుగల్లో అతి ముఖ్యమైన సంక్రాంతి పండుగ ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకునే ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీయస్ఆర్టీసీ విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టెర్ వెంకటేశ్వరరావు తెలిపారు.
శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి రోజువారిగా తిరిగే 246 బస్సులకు అదనంగా 250 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు వీటిని నడపుతున్నారని ఆయన తెలిపారు.
ప్రత్యేక సర్వీసులను రాత్రి 8గంటల తర్వాత మాత్రమే నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక సర్వీసులకు కూడా ఆన్లైన్ రిజర్వేషన్ సదుపాయం కల్పించామని, 50శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
మరోవైపు సంక్రాంతి పండుగను ముగించుకుని హైదరాబాద్ చేరుకునే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లతో పాటు రెగ్యులర్ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్కుమార్ వెల్లడించారు.
ముఖ్యంగా విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, విజయవాడ, ఖమ్మం, వరంగల్ నుంచి నడిచే రెగ్యులర్ రైళ్లకు అదనంగా 35 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నెల 20 వరకు రెగ్యులర్ రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం రిజర్వేషన్ కేంద్రాలను కూడా పెంచామన్నారు.