వైసీపీలోకి కేఈ సోదరులు..! కీలక నేతతో మంతనాలు: త్వరలో జగన్ తో భేటీ..!
టీడీపీ అధినేత చంద్రబాబు తో పాటుగా రాజకీయాల్లో సమకాలీకుడు..కలిసి పని చేసిన కర్నూలు జిల్లా సీనియర్ నేత కెఈ సోదరులు ఇప్పుడు టీడీపీ వీడుతున్నట్లుగా జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. కేఈ 2014 ఎన్నికల్లో పత్తికొండ నుండి గెలిచి..చంద్రబాబు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పని చేసారు. అయితే, ఆయన ఆ హోదాలో ఉన్న సమయంలో ప్రభుత్వం తీసుకొనే కీలక నిర్ణయాలు..తన అధీనంలో ఉన్న రెవిన్యూ శాఖకు సంబంధించి అంశాల్లోనూ జోక్యం లేకుండా చేయటం పైన బహిరంగంగానే అసహనం వ్యక్తం చేసేవారు. ఇక, తాజా ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు.
ఆయన కుమారుడిని రంగంలోకి దింపారు. కెఈ కుమారుడు శ్యామ్ తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక, కెఈ సోదరుడు ప్రభాకర్ టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. తాజాగా..ఒక బీసీ మంత్రి వారితో మంతనాలు సాగిస్తున్నట్లుగా సమాచారం. కెఈ సోదరులు ..వైసీపీలోకి చేరటానికి రంగం సిద్దమైందని ప్రచారం సాగుతోంది. త్వరలో వారు ముఖ్యమంత్రితో భేటీ అవుతారని జిల్లా నేతలు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వీరిని పార్టీలోకి తీసుకురావాలని మంత్రి ఒకరు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.
టీడీపీలో కొనసాగినా..అప్పటి నుండే
కెఈ క్రిష్ణమూర్తి..చంద్రబాబు..వైయస్సార్ ఈ ముగ్గరూ రాజకీయ సహచరులు. కెఈ తొలుత కాంగ్రెస్ ఆ తరువాత టీడీపీ తిరిగి కాంగ్రెస్..మరోసారి టీడీపీలో చేరారు. ఆయనతో పాటుగా ఆయన సోదరులు సైతం కర్నూలు జిల్లా టీడీపీలో కేఈ కుటుంబం కీలకంగా ఉంది. అయితే, 2014 ఎన్నికల్లో పత్తికొండ నుండి గెలిచిన కేఈ క్రిష్ణమూర్తికి బీసీ కేటగిరీలో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి.. రెవిన్యూ తో పాటుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు అప్పగించారు.
అయితే కీలకమైన రాజధాని అంశంలోనూ రెవిన్యూ శాఖ మంత్రిగా కెఇ కి ప్రమేయం లేకుండా చేసారు. అదే విధంగా తన శాఖ పరిధిలోని ఆర్డీఓల బదిలీ వ్యవహారం లోనూ ఆయన మాట చెల్లుబాటు అయ్యేది కాదు. మొత్త వ్యవహారం సీఎంఓ చూసుకొనేది. దీంతో..ఆయన అసంత్రుప్తితో ఉండేవారు. ఆ తరువాత కర్నూలులో సోదరుడు ప్రభాకర్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇక, జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో కెఇ కుటుంబం టీడీపీలో కొనసాగాలా వద్దా అనే చర్చ ఎన్నికల ముందే జరిగినట్లు అప్పట్లో ప్రచారం సాగింది.
భూమా..కోట్ల కుటుంబం రాకతో..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కెఈ కుటుంబానికి కర్నూలు జిల్లాలో రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్న భూమా కుటుంబాన్ని టీడీపీలో చేర్చుకున్నారు. భూమా అఖిలప్రియకు మంత్రి పదవిని కట్ట బెట్టారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలోనూ వారికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అయినా..పార్టీ అధికారంలో ఉండటం..మరో పార్టీ బలంగా లేకపోవటంతో కెఇ కుటుంబం అనేక సార్లు ఆలోచన చేసినా నిర్ణయం మాత్రం తీసుకోలేదు. ఇక, ఎన్నికల ముందు సుదీర్ఘ కాలంగా తమ రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్న కోట్ల కుటుంబాన్ని చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు కోరటంతో అయిష్టంగానే కేఈ అంగీకరించాల్సి వచ్చింది.
అయినా ఎన్నికల వేళ మాత్రం పరస్పర సహకారం లభించలేదు. ఇక, కెఇ కుమారుడు శ్యాం మీద ఆ సమయంలో హత్యా అభియోగాలు ఉన్నాయి. దీంతో..వారు టీడీపీలోనే కొనసాగాల్సి వచ్చిందని వారి సన్నిహితులు చెప్పేవారు. ఇక, ఇప్పుడు జిల్లాలో మారుతున్న సమీకరణాలతో వారు సైతం పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
Recommended Video
వైసీపీ మంత్రితో మంతనాలు..త్వరలో జగన్ వద్దకు ..!
గత వారం రోజులుగా కెఇ సోదరులు వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారని జిల్లాలో ప్రచారం సాగుతోంది. కెఇ క్రిష్ణమూర్తి ఆరోగ్య సమస్యలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని దాదాపు నిర్ణయించారు. తనయుడు శ్యాం రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచన చేస్తున్నారు. అయతే, అక్కడ పత్తికొండ నుండి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే కెఇ కుటుంబం పైన వ్యతిరేకతతో ఉన్నారు. తన భర్త నారాయణ రెడ్డి హత్య కేసులో శ్యామ్ ప్రమేయం ఉందంటూ ఎన్నికల సమయంలోనే ప్రచారం చేసారు. దీంతో..ఇప్పుడు కెఇ సోదరులు మాత్రమే వైసీపీలోకి తీసుకొనే విధంగా మంతనాలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.
కేబినెట్ లో కీలక శాఖను నిర్వహిస్తున్న మంత్రి వారితో టచ్ లో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే కెఇ సోదరులు ముఖ్యమంత్రితో సమావేశం అవుతారని..సూత్రి ప్రాయంగా వైసీపీలో చేరటానికి రంగం సిద్దమైందని విశ్వసనీయ సమాచారం. దీని పైన కెఇ సోదరులు..పార్టీ నేతలు మాత్రం స్పందించటానికి ముందుకు రావటం లేదు.