శాసనమండలి రద్దు దిశగా..! టీడీపీ లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వ అడుగులు..! అమలు సాధ్యమేనా..!
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోందా. ప్రభుత్వ వర్గాల్లో ఇప్పుడు రాజధాని వ్యవహారంతో పాటుగా శాసనమండలి వ్యవహారం సైతం హాట్ టాపిక్ గా మారింది. శాసనమండలిని రద్దు చేసే దిశగా ప్రభుత్వంలో కొందరు ప్రతిపాదనలు చేస్తున్నారని..దీని మీద అంతర్గతంగా చర్చ సాగుతోందని తెలుస్తోంది. తాజాగా..జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లులకు మండలిలో టీడీపీ కొర్రీలు వేసింది.
ముగిసిన అసెంబ్లీ సమావేశాలు.. 48 గంటలపాటు చర్చ...దిశతోపాటు కీలక బిల్లులు పాస్
దీంతో..బిల్లులు ఆమోదం పొందలేదు. తిరిగి శాసనసభకు రానున్నాయి. ఇక, ఈ బిల్లుల ఆమోదం పైన చర్చ సమయంలోనే ప్రభుత్వంలోని మంత్రులు మండలిని రద్దు చేస్తామంటూ హెచ్చరించినట్లుగా వార్తలు వచ్చాయి. అయినా..టీడీపీ వెనక్కు తగ్గలేదు. ఇక, ప్రభుత్వం ఇప్పుడు దీని పైన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి..ప్రభుత్వం ఈ రకంగా ఆలోచన చేసినా ..అమలు సాధ్యమేనా..నిజంగా ఇప్పుడు మండలి పైన వైసీపీ పట్టు సాధించలేదా...
శాసన మండలి రద్దు చేస్తారంటూ..
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. శాసనమండలిని రద్దు చేసే ప్రతిపాదన పైన ఉన్నత స్థాయిలో చర్చ జరిగిందని చెబుతున్నారు. తాజాగా..అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఇంగ్లీషు మీడియం స్కూళ్లు.. ఎస్సీ..ఎస్టీ ప్రత్యేక కార్పోరేషన్ల బిల్లులను ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే, శాసనమండలిలో మాత్రం మెజార్టీ ఉండటంతీ టీడీపీ సవరణలకు ప్రతిపాదించి..నెగ్గించుకుంది. దీంతో..బిల్లులు ఆమోదం పొందలేదు. ఆమోదం కోసం గవర్నర్ వద్దకు వెళ్లాల్సిన బిల్లులు..తిరిగి అసెంబ్లీకి రానున్నాయి. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లులు ఆమోదం పొందే అవకాశం ఉంది. అయితే, ఆ సమయంలో నే బిల్లుల ఆమోదం కోసం ఒప్పించే క్రమంలో..తాము మండలి రద్దు చేస్తామని మంత్రులు హెచ్చరించినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ, దీని పైన ఉన్నత స్థాయిలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
మండలి రద్దు సాధ్యమయ్యేనా...
ఇప్పుడు ప్రభుత్వ వర్గాలతో పాటుగా..అధికార వైసీపీలోనూ ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. శాసన మండలి రద్దు ప్రతిపాదన వచ్చిన మాట నిజమేనని..అయితే, ఎటువంటి నిర్ణయం దిశగా అడుగులు పడలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్టీఆర్ హాయంలో శాసనమండలిని రద్దు చేయగా..తిరిగి వైయస్సార్ ముఖ్యమంత్రి అయిన తరువాత మండలిని పునరుద్దరించారు. తన తండ్రి పునరుద్దరించిన శాసన మండలిని ఇప్పుడు జగన్ రద్దు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటారా..అంటే అలా జరగదని పొర్టీ నేతలే చెబుతున్నారు. అయితే, ఏపీ విభజన తరువాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు సైతం అప్పట్లో ఈ ప్రతిపాదన పైన చర్చ చేసారని..కేంద్రం వద్దకు తీసుకెళ్లారని..కానీ, పార్టీ నేతల నుండి వ్యతిరేకత రావటంతో ఆగిపోయారనేది మరో వాదన. కానీ, దీనిని టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. తిరిగి, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు అధికారిక వర్గాల్లో మాత్రం ప్రచారం సాగుతోంది.
టార్గెట్ టీడీపీ..కానీ, వైసీపీలోనే ఎక్కవ ఆశావాహులు
ఇప్పుడు 90 మంది ఉన్న శాసనమండలిలో ప్రస్తుతానికి టీడీపీ మెజార్టీ సభ్యులు ఉన్నారు. అందులో చంద్రబాబు తనయుడు లోకేశ్.. యనమల లాంటి వారు ఉన్నారు. ఇక, వైసీపీ ప్రభుత్వం నుండి సైతం ఇద్దరు మంత్రులు శాసన మండలి సభ్యులుగా ఉన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్.. మోపిదేవి వెంకటరమణ ఇద్దరూ ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. అదే విధంగా.. అనేక మందికి ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వలేకపోయిన వారికి జగన్ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే పార్టీ విజయం కోసం పని చేసినా..గుర్తింపు లేదనే ఆవేదనతో ఉంటూ..అవకాశం కోసం ఎదురు చూస్తున్న నేతలు పలువురు వైసీపీలో కనిపిస్తున్నారు. భవిష్యత్ లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీల స్థానంలో శాసనసభలో మెజార్టీ కారణంగా అవి వైసీపీకే దక్కనున్నాయి. ఇటువంటి సమయంలో ప్రస్తుత సమస్యల కారణంగా మండలి రద్దు ఆలోచన సరైనది కాదనే భావన ప్రభుత్వంలోని సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. అటువంటి ఆలోచన ఏదీ లేదని ఖండిస్తున్నారు. అయినా..ఈ ప్రచారం మాత్రం ప్రభుత్వంలోని ఉన్నత స్థాయిలో జరుగుతుండటంతో..అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.