ఆ నిబంధనలు సవరించి: మోడీకి బాబు ఝలక్, విభజన హామీలపై సుప్రీంలో కౌంటర్ అఫిడవిట్
అమరావతి/న్యూఢిల్లీ: టీడీపీ ప్రభుత్వం అన్నట్లుగానే విభజన హామీలపై కోర్టు మెట్లు ఎక్కింది! నవ్యాంధ్రకు విభజన హామీలు నెరవేర్చలేదంటూ టీడీపీ నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం శనివారం నాడు సుప్రీం కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే పూర్తి చేయలేదని అందులో పేర్కొంది.
చదవండి: ఏపీలో అద్దె ఇంట్లోకి.. హైదరాబాద్లో జనసేన కొత్త కార్యాలయం
ఏపీకి ప్రత్యేక హోదాను పక్కన పెట్టినట్లు పేర్కొంది. హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చినట్లుగా నిధులు ఇవ్వడం లేదని తెలిపింది. తాము వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం రూ.24,350 కోట్లు అడిగితే, కేంద్రం కేవలం రూ.1,050 కోట్లు మంజూరు చేసిందని సుప్రీంకు తెలిపింది. రాజధాని అమరావతికి రూ.11,602 కోట్లు అడిగితే కేవలం రూ.1,500 కోట్లు ఇచ్చిందని పేర్కొంది.
నాలుగేళ్లలో సాయం అంతంతే
పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7,918 కోట్లు ఖర్చు చేసిందని అఫిడవిట్లో పేర్కొంది. కానీ కేంద్రం రూ.5349 కోట్లు విడుదల చేసిందని తెలిపింది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు వ్యయం అంచనాలను రూ.57,948 కోట్లను కేంద్రం అంగీకరించడం లేదని తెలిపింది. ప్రత్యేక రైల్వే జోన్ అంశాన్ని పక్కన పెట్టిందని తెలిపింది. చట్టంలో పొందుపర్చిన హామీలను నిర్ణీత వ్యవధిలో ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీం కోర్టును అభ్యర్థించింది. ఈ నాలుగేళ్లలో కేంద్రం సాయం అంతంతే అని పేర్కొంది. ఉమ్మడి సంస్థల విభజన, విద్యా సంస్థల ఏర్పాటు, అమరావతిలో హైకోర్టు.. తదితర హామీలు నెరవేరలేదని పేర్కొంది.
పొంగులేటి పిటిషన్పై ఏపీ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్
విభజన చట్టంలోని ముఖ్యమైన హామీలు అమలు కాలేదంటూ సుదీర్ఘ అఫిడవిట్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీ, తెలంగాణ మధ్య సమస్యల పైన కూడా కేంద్రం నుంచి స్పందన లేని తెలిపింది. కేంద్రం ఇచ్చిన హామీలను, వాటి ప్రస్తుత స్థితిని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్లో సమగ్రంగా వివరించింది. విభజన చట్టం అమలులో జాప్యంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సుప్రీంలో వేసిన పిటిషన్పై ఏపీ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలుచేసింది.
కడప ఉక్కు పరిశ్రమ మొదలు విశాఖ రైల్వే జోన్
పదో షెడ్యూలులోని సంస్థల విభజన ఇంకా జరగలేదని ప్రభుత్వం పేర్కొంది. 142 సంస్థలను విభజించలేదని, కేంద్రం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందించలేదని పేర్కంది. నదీ నిర్వహణ అంశాన్ని నిర్దిష్ట కాలవ్యవధిలో అమలు చేయాలని కోరారు. బొగ్గు, చమురు, విద్యుత్ అంశాలు పెండింగులో ఉన్నాయని తెలిపింది. కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వే జోన్ అంశాలను తేల్చలేదని పేర్కొంది. 20-02-2014న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, అది నెరవేరలేదని చెప్పారు. విభజన హామీలపై ప్రధాని, కేంద్రమంత్రులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది.
ఈ కేంద్ర సంస్థల మాటేమిటి?
విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, 2015లో 526 ఏకరాల భూమి కేటాయించామని, రూ.420 కోట్లకు బదులు అప్పుడప్పుడు కొంత మాత్రమే ఇచ్చిందని లెక్కలు చెప్పింది. తిరుపతిలో ఐఐటీ కోసం 530 ఎకరాల భూమిని కేటాయించామని, మూడువేల కోట్లకు పైగా నిధులకు గాను వంద కోట్లకు పైగా మాత్రమే వచ్చాయన్నారు. అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, తాడేపల్లిగూడెంలో నిట్, విశాఖలో ఐఐఎం, తిరుపతిలో ఐసర్, గుంటూరులో వ్యవసాయ యూనివర్సిటీ, కర్నూలులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ డిజైన్ అండ్ మానుఫ్యాక్చరింగ్, మంగళగిరిలో ఎయిమ్స్ వంటి కేంద్ర సంస్థల పరిస్థితిని సుప్రీంకు వివరించింది.
మెట్రో రైలు నుంచి విమాన అంతర్జాతీయ సేవల వరకు
పెట్రోకాంప్లెక్స్ ఇష్యూను ప్రస్తావించింది. విజయవాడలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కు నిధులు విడుదల చేయాలన్నారు. రాజధాని అమరావతి నుంచి హైదరాబాదుతో పాటు ఇతర తెలంగాణ పట్టణాలకు ర్యాపిడ్ రైల్, రోడ్ కనెక్టవిటీ ఏర్పాటును త్వరగా అమలు చేయాలని కోరారు. విశాఖ, విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రో రైలు ప్రాజెక్టులను త్వరగా అభివృద్ధి చేయాలని కోరారు. విశాఖలో పెట్రోలియం ఎనర్జీ సంస్థ ఏర్పాటుకు భూమి కేటాయించామని, తగిన నిధులు విడుదల చేయాలని కోరారు. విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ను నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల నుంచి అంతర్జాతీయ సేవలు ప్రారంభించాలని కోరింది.
చట్టంలో ఇబ్బందిగా ఉన్న నిబంధనలు సవరించి..
అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225 వరకు పెంచడం, హైకోర్టు ఏర్పాటు, వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీని ప్రస్తావించింది. వెనుకబడిన జిల్లాల కోసం రూ.350 కోట్ల చొప్పున 1050 కోట్లను తొలి మూడేళ్లలో విడుదల చేసిందని తెలిపారు. బుందేల్ఖండ్ ప్యాకేజీలో ఒక్కొక్కరిపై రూ.4115 ఇస్తుండగా ఏపీ విషయంలో రూ.428.57 మాత్రమే ఇస్తున్నారని పేర్కొంది. పోలవరంతో ప్రాజెక్టు ప్రభావిత ప్రాంత ప్రజలు, గ్రామాలు, అటవీ ప్రాంతం, చారిత్రక ఆలయాలు, గిరిజనుల సంస్కృతి, గోదావరి నది తదితర అంశాలను విస్మరించి ఈ ప్రాజెక్టు చేపడుతున్నామన్నది సరికాదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. గిరిజనుల సంస్కృతి, పర్యావరణం, ప్రాజెక్టు పరిధిలోని కుటుంబాల జీవనోపాధి, భద్రాచల శ్రీరామచంద్రస్వామి ఆలయం.. అన్నింటిని పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపింది. విభజన చట్టంలో ఇబ్బందిగా ఉన్న నిబంధనలను సవరించి, తగిన చర్యలు తీసుకొని దుగరాజుపట్నం పోర్టును కాలపరిమితితో పూర్తి చేయాలని కోరారు.