ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగం కావాలి...ఎపి నంబర్ వన్ గా ఉండాలి:సిఎం చంద్రబాబు
విజయవాడ: ప్రతి ఒక్కరి జీవితంలో స్పోర్ట్స్ ఒక భాగం కావాలని...స్పోర్ట్స్కు ప్రాధాన్యత ఇవ్వడం సమాజానికి మంచిదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.
విజయవాడలో నిర్మించనున్న అంతర్జాతీయ క్రీడా ప్రాంగణానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ నేతలకు రాష్ట్ర, దేశస్థాయిలో మాత్రమే గుర్తింపు వస్తుందని క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు. ఐకాన్గా ఎదుగుతారని గుర్తు చేశారు. ప్రపంచాన్ని జయించే శక్తి క్రీడాకారులకు ఉంటుందని అన్నారు.
ఎపినే...నంబర్ వన్
ఆంధ్రప్రదేశ్ దేనిలోనైనా నంబర్ వన్ గా ఉండాలని...అంతే కానీ వేరే స్థానంలో ఉండటానికి వీల్లేదని చెప్పారు. ఎపి దేనిలోనైనా నంబర్ వన్గా ఉండాలన్నదే తన తపన అన్నారు. రాష్ట్రంలో అద్భుతమైన ప్లే గ్రౌండ్లను నిర్మించేందుకు మరమ్మతులు చేపడుతున్నామన్నారు.
ఆనాడు...దూరదృష్టి
ఆనాడు దూరదృష్టితో హైదరాబాద్ చుట్టూ ఎల్బీనగర్, యూసఫ్ గూడ, మేడ్చల్లలో మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. తాను చూపిన చొరవతోనే గోపీచంద్ అకాడెమీ అంతర్జాతీయ క్రీడాకారులను అందివ్వగలుగుతుందన్నారు. ఇవాళ ప్రఖ్యాత క్రికెటర్ అనిల్ కుంబ్లే సహకారంతో ప్రారంభిస్తున్న ప్రాజెక్ట్ గాండీవ ద్వారా అత్యుత్తమ క్రీడాకారులను దేశానికి అందిస్తామన్నారు.
అంతర్జాతీయ క్రీడలు...సైతం
ఈ ప్రాజెక్ట్ లో జాతీయ, అంతర్జాతీయ క్రీడలు ఉండేలాగా చూస్తామన్నారు. బాగా ఆడేవాళ్లకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వాళ్లను గుర్తించి.. ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఎప్పటికప్పుడు పాలసీలపై పునఃసమీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు క్రీడలతో పాటు...చదువుల్లో ముందుండాలని సూచించారు.
త్వరలో...సిఎం కప్
త్వరలో సీఎం కప్ ప్రారంభించి.. క్రీడల్లో ప్రతిభ కనపరిచినవారికి ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రముఖ క్రీడాకారులు కుంబ్లే, కరణం మల్లేశ్వరి, కోనేరు హంపి తదిదరులు పాల్గొన్నారు.