జగన్తో విభేదాల్లేవ్ కానీ: ఎస్పీవై, ఖమ్మం ఎంపీ వివరణ
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడంపై నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆదివారం స్పందించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని, అలాగే ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. అయితే తన నియోజకవర్గం అభివృద్ధి దృష్ట్యా టిడిపిలో చేరినట్లు చెప్పారు.
చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన అనంతరం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. తాను మాజీ మంత్రి టిజి వెంకటేష్ ద్వారా టిడిపిలో చేరానని చెప్పారు. తన ప్రాంత అభివృద్ధి కోసమే సైకిల్ ఎక్కినట్లు చెప్పారు. తనకు పార్టీల కంటే ప్రజలు, నియోజకవర్గం అభివృద్ధి ముఖ్యమని చెప్పారు.
రాబోయే ఐదేళ్ల వరకు కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఈ సమయంలో తనకు ప్రజలు, అభివృద్ధి ముఖ్యమన్నారు. తన పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవిశ్వాసం వేటు వేస్తే తాను మరింత అత్యధిక మెజార్టీతో ఈసారి గెలుస్తానని చెప్పారు. వచ్చే ఐదేళ్లు చాలా విలువైనవని చెప్పారు. సాయంత్రంలోగా బుట్టా రేణుక కూడా చేరే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ఖమ్మం ఎంపీ వివరణ
తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడి తెరాస వైపు వెళ్తున్నానని జరుగుతున్న ప్రచారం పైన ఖమ్మం జగన్ పార్టీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడే ప్రసక్తి లేదని చెప్పారు. జగన్కు తాను అండగా ఉంటానని అన్నారు.