ఎస్పీవై రెడ్డికి జనసేన పార్టీ బంపర్ ఆఫర్: ఫ్యామిలీ మొత్తానికీ టికెట్లు: ఒకరా? ఇద్దరా? నలుగురు
కర్నూలు: నేను కుటుంబ రాజకీయాలకు దూరం. రాజకీయాల్లో వారసత్వాన్ని అస్సలు ప్రోత్సహించను. కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వను.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రతి సభలోనూ, ప్రతి వేదిక మీదా చెప్పే మాట. వాస్తవ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. మొన్నటికి మొన్న తన సోదరుడు నాగబాబుకు నరసాపురం లోక్ సభ టికెట్ ను కేటాయించారు. ఆ లోక్ సభ టికెట్ కోసం ఇన్నాళ్లూ పడిగాపులు పడ్డ సీనియర్ పార్టీ నాయకులకు కాదని.. సోదరునికి టికెట్ ఇచ్చారు.
అక్కడితో ఆగలేదు. కర్నూలు జిల్లా సీనియర్ నాయకుడు, నంద్యాల లోక్ సభ సభ్యుడు ఎస్పీవై రెడ్డి కుటుంబంలో ఏకంగా నలుగురికి టికెట్లు ఇచ్చేశారు. ఒక లోక్ సభ, మూడు అసెంబ్లీ స్థానాలను ఒక్క ఎస్పీవై రెడ్డి కుటుంబమే దక్కించుకుందంటే జనసేన పార్టీలో కుటుంబ రాజకీయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
హ్యాండిచ్చిన చంద్రబాబు..
తెలుగుదేశం పార్టీలో నంద్యాల లోక్ సభ టికెట్ కోసం చివరి వరకూ ప్రయత్నించి, విఫలమైన నాయకుడు ఎస్పీవై రెడ్డి. 2014లో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నంద్యాల లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించిన ఆయన.. కొద్దిరోజుల్లోనే పార్టీ ఫిరాయించారు. తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో కూడా నంద్యాల టికెట్ దక్కుతుందని చివరి వరకూ ఆశ పెట్టుకన్నారు. కుదర్లేదు. ఎస్పీవై రెడ్డిని కాదని నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన మాండ్ర శివానంద రెడ్డి పేరును ప్రకటించారు చంద్రబాబు నాయుడు.
డిమాండ్లకు తలొగ్గిన పవన్ కల్యాణ్..
దీనితో పార్టీ నుంచి బయటికి వచ్చిన ఎస్పీవై రెడ్డి మొదట స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అదే సమయంలో జనసేన పార్టీ ఆయనపై కన్నేసింది. ఎస్పీవై రెడ్డితో సంప్రదింపులు నిర్వహించింది. పార్టీలో చేరడానికి ఆయన పెట్టిన అన్ని షరతులనూ అంగీకరించారు పవన్ కల్యాణ్. ఆయన కోరుకున్నట్లుగా కుటుంబంలో నలుగురికి టికెట్లు ఇచ్చారు.
ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ (ఫొటోలు)
ఎస్పీవైతో పాటు అల్లుడు, ఇద్దరు కుమార్తెలకు టికెట్లు.
ఎస్పీవై రెడ్డి నంద్యాల లోక్ సభ అభ్యర్థిగా జనసేన తరఫున పోటీ చేస్తుండగా పెద్ద అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డికి నంద్యాల అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. అలాగే- ఇద్దరు కుమార్తెలు సజ్జల సుజలకు శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించగా.. అరవింద వాణికి బనగానపల్లి బరిలో దింపారు పవన్ కల్యాణ్. వారిలో సజ్జల శ్రీధర్ రెడ్డి, సుజల భార్యాభర్తలు. ఈ రకంగా చూసుకున్నా, జనసేన పార్టీ భార్యభర్తలకు టికెట్లను ఇచ్చి, కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించినట్టయింది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం.. బరిలో నిల్చున్న అభ్యర్థుల తుది జాబితాను పరిశీలిస్తే.. ఇలాంటివే మరికొన్ని ఘటనలు ఉన్నాయి.
ఎస్పీవై రెడ్డే పెద్ద దిక్కు
నంద్యాలతో పాటు, శ్రీశైలం, బనగాన పల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు.. నంద్యాల లోక్ సభ పరిధిలోనివే కావడం ఆసక్తి కలిగించే అంశం. ఎస్పీవై రెడ్డి ముఖం చూసి, అక్కడి ఓటర్లు కుటుంబ రాజకీయాల వైపు మొగ్గు చూపుతారా? లేదా? అనేది చర్చనీయాంశమైంది. సజ్జల శ్రీధర్ రెడ్డి, ఆయన భార్య సుజల, అరవింద వాణి ప్రస్తుతం ఎస్పీవై రెడ్డి పేరు చెప్పుకొనే ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పారిశ్రామికవేత్తగా, నంది పైపుల గ్రూపు సంస్థల ఛైర్మన్ గా ఎస్పీవై రెడ్డికి ఉన్న పేరును ఓట్లుగా మార్చుకోవడానికి వారు తాపత్రయ పడుతున్నారు. పవన్ కల్యాణ్ పేరు చెప్పుకొంటే ఓట్లు పడవనే అభిప్రాయం.. వారిలో వ్యక్తమౌతోంది.
నంద్యాల బరిలో ఒకే సామాజిక వర్గ అభ్యర్థులు..
తెలుగుదేశం పార్టీ తరఫున మాండ్ర శివానంద రెడ్డి నంద్యాల లోక్ సభ బరిలో ఉండగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యాసంస్థల అధినేత పోచా బ్రహ్మానంద రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎస్పీవై రెడ్డి కూడా రంగంలో దిగడంతో.. నంద్యాల లోక్ సభ బరిలో త్రిముఖ పోటీ ఏర్పడింది. ఈ ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా మెజారిటీ పెద్దగా దక్కకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. బొటాబొటి మెజారిటీతో విజయం సాధించవచ్చని, పోరు ఏకపక్షం కాదనే సంకేతాలు అందుతున్నాయి.