చేస్తుందేంటి: కెసిఆర్కి శ్రవణ్ సూటి ప్రశ్న, కర్నె కంటతడి
పోరాడిన వారికే కత్తి ఇవ్వాలని చెప్పిన కెసిఆర్ చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. గాడిదకు గడ్డి వేసి ఆవుకు పాలు పితికితే వస్తాయా? అని ప్రశ్నించిన కెసిఆర్ ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు బాగుందా అన్నారు. తనను కులం పేరుతో అవమానిస్తారా అని మండిపడ్డారు. తన కులానికి చెందిన కుటుంబాలు ఊరికి రెండు కూడా ఉండవని, ఇక ఎలా గెలుస్తావని కెసిఆర్ తనను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెరాసలో కుటుంబ పాలన, నియంతృత్వ ధోరణి వల్లనే తాను ఆ పార్టీని వీడినట్లు చెప్పారు. పార్టీ కోసం తానెంతగానో కృషి చేసినా సరైన ప్రాతినిథ్యం దక్కలేదన్నారు. దాసోజు శ్రవణ్ కుమార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయనకు ప్రధాన అధికార ప్రతినిధి పదవిని ఇచ్చారు.
శ్రవణ్ కుమార్తో పాటు తెరాస హైదరాబాద్ నగర అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్, ఎల్బీనగర్ నియోజకవర్గ ఇంఛార్జ్ కాచం సత్యనారాయణ, జనగామ టిడిపి తిరుగుబాటు అభ్యర్థి మండల శ్రీరాములు తదితరులు కాంగ్రెసు పార్టీలో చేరారు. వారికి జైరాం రమేష్ కండువా కప్పి ఆహ్వానించారు.
మరో నేత కర్నె ప్రభాకర్ అంతకుముందు తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. తెరాస అనే విత్తనాన్ని నాటి, నీళ్లు పోసి మొక్కగా పెంచి... మహావృక్షం చేశామని, ఈ మహావృక్షానికి చెదలు పట్టిందేమో అని విమర్శించారు. తెరాస నుంచి టికెట్ రానందుకు బాధగా ఉందని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.