శ్రీచైతన్య, నారాయణల మధ్య ర్యాంకుల చిచ్చు..."నారాయణ"వి చిల్లరపనులు:బివిరావు
విజయవాడ: శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల మధ్య ర్యాంకుల విషయమై వివాదం చెలరేగింది. తమ సంస్థకు వచ్చిన ర్యాంకులను కూడా నారాయణ సంస్థ వారికి వచ్చినట్లుగా ప్రకటించుకుంటోందని శ్రీచైతన్య విద్యాసంస్థల అధిపతి బిఎస్ రావు ఆరోపించారు.
విజయవాడ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ విద్యాసంస్తలపై శ్రీచైతన్య విద్యాసంస్థల అధిపతి బిఎస్ రావు తీవ్ర విమర్శలు చేశారు. శ్రీచైతన్య, నారాయణ ఉమ్మడి సంస్థ చైనా బ్యాచ్ గతంలోనే రద్దయిపోయిందని, ఆ విషయాన్ని తాను పలు సార్లు పెద్దల సమక్షంలో, మీడియా సముఖంగా కూడా చెప్పినట్లు బిఎస్ రావు స్పష్టం చేశారు.
అయినా ఒప్పందాన్ని ఉల్లంఘించి శ్రీచైతన్యలో చదివిన విద్యార్థులను తమ విద్యార్థులుగా నారాయణ విద్యాసంస్థ చెప్పుకుంటోందని ఆయన ఆరోపించారు. జేఈఈ మెయిన్స్ ఎంట్రన్స్ లో టాప్ 5 ర్యాంకుల తమవేనని శ్రీచైతన్య అధినేత బీవీ రావు స్పష్టం చేశారు. అయినా ఆ విద్యార్థులను వారి విద్యార్థులుగా పేర్కొంటూ నారాయణ సంస్థ ప్రకటనలు ఇవ్వడం సరికాదన్నారు. ఈ విధంగా నారాయణ విద్యాసంస్థ చిల్లర పనులు చేస్తోందని బీఎస్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము మరోసారి ఒక విషయం స్పష్టం చేస్తున్నామని, ఇకపై చైనా బ్యాచ్ లు అనేవి ఉండవని పునరుద్ఘాటించారు. నారాయణ తప్పుడు ప్రచారాలకు పాల్పడితే ఆ సంస్థలపై కేసులు పెట్టాల్సివస్తుందని శ్రీచైతన్య విద్యాసంస్థల అధిపతి బిఎస్ రావు ఈ సందర్భంగా హెచ్చరించారు. నారాయణ తమపై గతంలో అకారణంగా కేసులు పెట్టి వేధించిందని, తాము మాత్రం పక్కా ఆధారాలతో కేసులు పెడతామని స్పష్టం చేశారు.