రఘురామకృష్ణంరాజుపై కులసంఘాలు ఫైర్, శ్రీరంగనాథరాజు, నాగేశ్వరరావుపై కామెంట్లతో ఆగ్రహం..
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై కులసంఘాలు మండిపడ్డాయి. మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుపై చేసిన కామెంట్లపై ఆయా చోట్ల అనుచరులు భగ్గుమన్నారు. వెంటనే కామెంట్లను వెనక్కి తీసుకోవాలని.. లేదంటే పశ్చిమ గోదావరి జిల్లాలో తిరగనీయబోమని హెచ్చరించారు. పలుచోట్ల ఎంపీ ప్లెక్సీలు తగులబెట్టి తమ నిరసన తెలిపారు.
జిల్లాలో తిరగనీయం..
మంత్రి శ్రీ రంగనాథరాజుపై కూడా రఘురామకృష్ణంరాజు నోరు పారేసుకున్నారు. మొన్న ప్రసాదరాజుతో తిట్టించి.. ఇప్పుడు రంగనాథరాజుతో మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. ఇతర అవినీతి ఆరోపణలు కూడా చేయడంతో మంత్రి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పునుమంట్ర మండలం మార్టేరు సెంటర్ వద్ద రఘురామకృష్ణంరాజు దిష్టిబొమ్మను దహనం చేశారు. మంత్రికి క్షమాపణ చెప్పకుంటే జిల్లాలో తిరగనివ్వమని హెచ్చరించారు. గణపరంలో కూడా మంత్రి అనుచరులు నిరసన ప్రదర్శనలు చేశారు.
ప్లెక్సీకి పసుపు, నీళ్లు
ఇటు ఆకివీడు వైఎస్ఆర్ సెంటర్లో రఘురామకృష్ణంరాజు ప్లెక్సీపై పసుపు, నీళ్లు చల్లి శుభ్రపరిచారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుపై చేసిన అవినీతి ఆరోపణలపై భగ్గుమున్నారు. వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు ప్లెక్సీకి గాజులు తొడిగి, కోడిగుడ్లు, టమోటాలతో కొట్టి తమ నిరసనను తెలియజేశారు.
కులసంఘాల నిరసనలు
రఘురామకృష్ణంరాజు బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఆయన సీఎం జగన్పై విమర్శలు చేయడం, ప్రభుత్వ పథకాల తీరును తప్పుపట్టడంతో వైసీపీ నేతలు ముప్పేట దాడికి దిగారు. తొలుత ఎమ్మెల్యే ప్రసాదరాజు.. ఎంపీపై విరుచుకుపడ్డారు. జగన్ దయతోనే ఆయన ఎంపీ అయ్యారని.. పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పదవీ వచ్చిందని పేర్కొన్నారు. మిగతా నేతలు కూడా ఆడపా దడపా కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. దీనికి రఘురామ కూడా ధీటుగానే స్పందిస్తున్నారు. మంత్రి రంగనాథరాజు, కారుమూరి నాగేశ్వరరావుపై కామెంట్లు చేయడంతో.. ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.