శ్రీవారిని దర్శించుకున్న రవిశంకర్, విభజనపై స్పందన
కాగా, అంతకుముందు రోజు ఆయన విభజన అంశంపై హైదరాబాదులో స్పందించారు. రాష్ట్రంలో కురుక్షేత్ర వాతావరణం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఆత్మపరిశీలన చేసుకొని అంతర్గత ధ్యానం ద్వారా వీటిని అధిగమించాలన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల్లో సుఖం, శాంతి నింపే సమాజ స్థాపనకు ప్రస్తుత రాజకీయాల్లో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు యువత నడుంబిగించాలని పిలుపునిచ్చారు.
అనంతరం... దేశవ్యాప్తంగా ప్రత్యేక రైలులో అనుగ్రహయాత్ర నిర్వహిస్తున్న రవిశంకర్ గురూజీ శనివారం సాయంత్రం అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ చేరుకున్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్నారన్నారు. ప్రస్తుతం అవినీతి, స్వార్థచింతన, స్వలాపేక్ష పెరిగిపోయామన్నారు. ఫలితంగా అభివృద్ధి కనుమరుగైందన్నారు.
అద్భుతమైన ప్రపంచాన్ని నిర్మించుకోవడానికి అందరి కళ్లలో ఆనందం, సంతోషం నింపడానికి ప్రజలతో కలిసి ముందుకు నడవటానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. రాజకీయ నాయకుల స్వార్థం వల్ల దేశాభివృద్ధికి వినియోగించాల్సిన కోట్లాది రూపాయలు స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్నాయన్నారు.
రాజకీయ నాయకులు అక్రమంగా దాచుకున్న నల్లధనాన్ని బయటుకు తీస్తే దేశంలోని ప్రతి వ్యక్తికి రూ.3 లక్షలు అందజేయవచ్చన్నారు. దేశంలో మార్పు కోసం యువత ప్రతిరోజూ గంట సమయం వెచ్చించాలన్నారు. ఇతర దేశాల్లో ఆహార ధాన్యాల ధర తగ్గుతుండగా ఒక్క భారతదేశంలో మాత్రమే రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు.