సినిమాలంటే ప్రాణం: శ్రీదేవి మరణంతో తిరుపతిలో విషాదం, బంధువుల కన్నీటిపర్యంతం
చిత్తూరు: ప్రముఖ అందాల నటి శ్రీదేవి తెలువారికి పరిచయం అవసరం లేని పేరు. శనివారం అర్ధరాత్రి దుబాయిలో ఆమె గుండెపోటుతో మరణించారన్న వార్త తెలుగు సినీ పరిశ్రమతోపాటు తెలుగు ప్రజలను కూడా ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసింది.
ముఖ్యంగా శ్రీదేవి మరణంతో చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో విషాధ చాయలు అలుముకున్నాయి. ఇందుకు తిరుపతితో శ్రీదేవికి ఉన్న అనుబంధమే కారణం.
తిరుపతిలో పూర్వీకులు
శ్రీదేవి పూర్వీకులు తిరుపతి నుంచే తమిళనాడుకు వలస వెళ్లారు. అయితే, శ్రీదేవికి దగ్గరి బంధువులు చాలా మంది మాత్రం ఇప్పటికీ తిరుపతిలోనే నివాసం ఉంటున్నారు.
అందమైన కథ ముగిసింది: సినీ, రాజకీయ దిగ్గజాల దిగ్భ్రాంతి, హేమ, సచిన్.. ఏమన్నారంటే..?
కన్నీటిపర్యాంతమయ్యారు
శ్రీదేవి ఆకస్మక మరణవార్త విన్న తిరుపతిలోని ఆమె బంధువులు కన్నీటిపర్యాంతమయ్యారు. శ్రీదేవి తల్లి రాజేశ్వరి మరణించిన తర్వాత ఆమె ఆలనాపాలనా చూసిన పినతల్లులు అనసూయమ్మ, మునిసుబ్బమ్మ విషాదంలో మునిగిపోయారు.
మళ్లీ వస్తానని చెప్పి..
శ్రీదేవి తిరుపతి వచ్చినప్పుడల్లా తమ ఇంటికి వచ్చి పలకరించేదని.. అలాగే ఈ సంవత్సరం కూడా వస్తానని చెప్పిందని వారు చెప్పారు. అయితే, ఇంతలోనే ఆమె కానరాని లోకాలకు వెళ్లిపోయారని కంటతడిపెట్టారు.
సినిమాలంటే ప్రాణం
శ్రీదేవికి సినిమాలంటే ప్రాణమని, అందుకే మరో వ్యాపకం కూడా లేకుండా ఆ రంగంలోనే నిలబడాలని తీవ్రంగా కష్టపడిందని వారు చెప్పారు. శ్రీదేవి లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని వారన్నారు.