వివేక్పై శ్రీధర్ అసంతృప్తి, సిట్టింగులకు పొత్తు తిప్పలు
కరీంనగర్/హైదరాబాద్: పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు జి వివేక్ తిరిగి కాంగ్రెసు పార్టీలో చేరటం పట్ల తాను అసంతృప్తితో ఉన్నట్లు మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చెప్పారు. బుధవారం కరీంనగర్ జిల్లా మంథనిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు.. కాంగ్రెస్ శ్రేణులు ఇబ్బందులకు గురవుతున్నప్పుడు.. సోనియాగాంధీ అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంటున్నప్పుడు.. వివేక్ పార్టీ వీడారన్నారు.
అసంతృప్తి వ్యక్తిగతమని, సోనియా ఆదేశిస్తే వివేక్తో కలిసి పని చేయటానికి సిద్ధమన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు, సీమాంధ్రకు ఒకే మేనిఫెస్టో ప్రకటించారని విమర్శించారు. స్వశక్తి మహిళలు, రైతుల గురించి మేనిఫెస్టోలో ప్రస్తావించలేదన్నారు. తెలంగాణలో గెలువలేమనే బాబు బిసిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించారన్నారు.
సిట్టింగులకు తిప్పలు
సిపిఐతో పొత్తుతో కాంగ్రెస్లోని పలువురు సిట్టింగ్లకు కష్టాలు మొదలయ్యాయి. దీనిపై ఏం చేయాలో పాలుపోని స్థితి కాంగ్రెస్ అధినాయత్వంలో నెలకొంది. ఇప్పటికే ఒక లోకసభ, 9 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెసు ఆఫర్ చేసింది. అయితే, తెలంగాణలో మూడు లోకసభ, 17 అసెంబ్లీ స్థానాలను సిపిఐ కోరుతోంది. తమ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలతో పాటు మరో 14 స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
ఇందులో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు ఉండడంతో, వాటిని సిపిఐకి కేటాయించడంపై అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. సిపిఐకి ఆ పార్టీ సిట్టింగ్ స్థానాలు బెల్లంపల్లి, మునుగోడు, వైరా (ఎస్టీ), కొత్తగూడెంలతోపాటు.. హుస్నాబాద్, స్టేషన్ ఘన్పూర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం లేదా బహదూర్పుర స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపుతోంది. అయితే మెదక్ జిల్లా నర్సాపూర్ కూడా కావాలని సిపిఐ పట్టుబడుతోంది.
ఈ స్థానం నుంచి సిటింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వి సునీతా లక్ష్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనిని కేటాయించేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేదు. నర్సపూర్ వల్లే పొత్తు విచ్ఛిన్నమయ్యే పరిస్థితే వస్తే సునీతా లక్ష్మారెడ్డిని మెదక్ లోకసభ స్థానం నుంచి నిలపాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే, నర్సపూర్ అసెంబ్లీ వీడేందుకు ఆమె ఇష్టపడటంలేదు.
చేవెళ్ల లోకసభ స్థానం నుంచి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డిని రంగంలోకి దించాలని యోచిస్తున్నందున మహేశ్వరం అసెంబ్లీ స్థానాన్ని సిపిఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. మొత్తానికి 9 సిపిఐకి ఖమ్మం లోకసభతో పాటు.. 9 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖతను వ్యక్తం చేస్తోంది.
మహేశ్వరం టిక్కెట్ సిపిఐకి ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి నివాసానికి కార్యకర్తలు చేరుకుంటున్నారు. మహేశ్వరం టిక్కెట్ను సిపిఐకి కేటాయించవద్దని వారు అదిష్టానాన్ని కోరుతున్నారు.