కాదంటే చంద్రబాబు స్టయిలే వేరు: ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి శ్రీధరన్ గుడ్ బై
నవ్యాంధ్రప్రదేశ్.. విజన్ 2020 స్రుష్టికర్త ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్టయిలే వేరుగా ఉంటుంది. ప్రచారానికి ప్రాధాన్యం ఇచ్చే తెలుగుదేశం పార్టీ అధినేత... ప్రభుత్వ సారధిగా అన్నీ తానై వ్యవహరిస్తారన్న పేరు ఉ
హైదరాబాద్/ అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్.. విజన్ 2020 స్రుష్టికర్త ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్టయిలే వేరుగా ఉంటుంది. ప్రచారానికి ప్రాధాన్యం ఇచ్చే తెలుగుదేశం పార్టీ అధినేత... ప్రభుత్వ సారధిగా అన్నీ తానై వ్యవహరిస్తారన్న పేరు ఉన్నది. కానీ సాంకేతికంగా వివిధ రంగాల ప్రముఖుల సలహాలు తీసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ తనకు ఇష్టం లేని సలహాలు ఇచ్చే వారంటే ఆయనకు అసలే గిట్టదంటే అతిశేయోక్తి కాదు. ఆ కోవలోకే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) చైర్మన్గా వ్యవహరిస్తూ, నిర్వఘ్నంగా ఢిల్లీ మెట్రో రైల్ నడుపడంలో కీలక పాత్ర వహిస్తున్న శ్రీధరన్, ఏపీ మాజీ ప్రభుత్వ కార్యదర్శి ఐవిఆర్ క్రుష్ణారావు కూడా వస్తారు.
క్రుష్ణా, గుంటూరు జిల్లాల మధ్య నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని 'అమరావతి'ని కలుపుతూ మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టేందుకు సీఎం చంద్రబాబు పూనుకున్నారు. కానీ అది వ్యయ భరితం కావడంతో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తున్నది. తాను చెప్పిన మౌలిక వసతుల కల్పన సంస్థలకే ఆ ప్రాజెక్టు కట్టబెట్టాలని శ్రీధరన్పై ఒత్తిడితేయడం చంద్రబాబు స్టయిలని తాజాగా మరోసారి తేలింది. తన ఆలోచనలు అమలు చేయనందుకు దాదాపుగా ఆరు నెలలుగా తనకు అప్పాయింట్ మెంట్ ఇవ్వడం లేదని శ్రీధరన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎల్ అండ్ టీ, కేఎఫ్డబ్ల్యూకే ప్రాజెక్టు ఇవ్వాలని ఒత్తిళ్లు
చంద్రబాబు నాయుడు తీరుతో మనస్తాపానికి గురై తన సలహదారు పదవికి రాజీనామా శ్రీధరన్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తీరుతో విసిగిపోయిన మెట్రో రైలు ప్రాజెక్టుల పితామహుడు శ్రీధరన్పై లేనిపోని అభాండాలు వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో వైదొలగాలని శ్రీధరన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత నెల 12వ తేదీన సీఎం చంద్రబాబుకు ఆయన నేరుగా రాజీనామా లేఖ పంపారు. అయినా ఆయన స్పందించలేదు సరికదా వెంటనే విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు స్థానంలో లైట్ మెట్రో రైలు ప్రాజెక్టును జర్మనీ ఆర్థిక సంస్థ ‘కేఎఫ్డబ్ల్యూ'కు ఇవ్వాలని నిర్ణయించారు. దీని వెనుక పెద్ద గూడు పుఠాణీ జరిగినట్లు సమాచారం.
వ్యూహాత్మకంగా శ్రీధరన్ రాజీనామాకు చంద్రబాబు వ్యూహం
మెట్రో రైలు ప్రాజెక్టు పనులను అంచనాల కంటే చాలా ఎక్కువ రేటుకు ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్ సంస్థలకు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన సూచనను శ్రీధరన్ తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రభుత్వ పెద్దలు ఆయన్ను లక్ష్యంగా చేసుకుని ఒక వ్యూహం ప్రకారం ఆయనంతట ఆయనే రాజీనామా చేసే పరిస్థితి కల్పించారు. గత ఏడాది డిసెంబర్లో విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులోని రూ.1700 కోట్ల విలువైన రెండు కారిడార్ల పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని డీఎంఆర్సీ ప్రతిపాదించింది.
మెట్రో ప్రాజెక్టు కోసం మూడు సంస్థల టెండర్లు
వీటన్నింటినీ ఒకే ప్యాకేజీగా టెండర్ పిలవాలని ఏపీ ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చారు. తమ నిబంధనల ప్రకారం రూ.500 కోట్లకు మించిన పనుల్ని రెండు ప్యాకేజీలుగా విభజించాల్సి వుందని, అంతకంటే ఎక్కువ మొత్తానికి ఒకే టెండర్ పిలవడం వల్ల ఆర్థిక స్థోమత లేక ఎక్కువ సంస్థలు పోటీ పడే అవకాశం ఉండదని.. దీనివల్ల ఒకటి, రెండు కంపెనీలే ఎక్కువ మొత్తానికి కోట్ చేసే పరిస్థితి ఉంటుందని ప్రభుత్వానికి డీఎంఆర్సీ నివేదించింది. అయినా ప్రభుత్వం వినకుండా రెండు ప్యాకేజీలుగానైనా విభజించి టెండర్లు పిలవాలని సూచించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రూ.800 కోట్లతో కారిడార్-1కు, రూ.900 కోట్లతో కారిడార్-2కు టెండర్లు పిలిచింది. ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్, సింప్లెక్స్ సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి.
ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్ కుమ్మక్కు
సింప్లెక్స్ సంస్థ టెండరు దాఖలు చేశాక, తనకు ఆర్థిక స్థోమత సరిపోనందున డిస్క్వాలిఫై అవుతానని లేఖ రాసి పక్కకు తప్పుకున్నది. ఈ నేపథ్యంలో కారిడార్-1కి ఎల్ అండ్ టీ 45 శాతం, ఆఫ్కాన్స్ 55 శాతం ఎక్సెస్కు, కారిడార్-2కు ఎల్ అండ్ టీ 45 శాతం, ఆఫ్కాన్స్ 35 శాతం ఎక్సెస్కు టెండర్ కోట్ చేశాయి. దీనిప్రకారం కారిడార్-1 పనులు ఎల్ అండ్ టీకి, కారిడార్-2 పనులు ఆఫ్కాన్స్కు దక్కుతాయి. కారిడార్-2లో 35 శాతం ఎక్సెస్కు కోట్ చేసిన ఆఫ్కాన్స్.. కారిడార్-1కి 55 శాతం కోట్ చేయడం వెనుక లాలూచీ ఉన్నదని స్పష్టంగా తెలుస్తోంది. రెండు సంస్థలు రింగైనట్లు గమనించిన డీఎంఆర్సీ, దీనివల్ల ప్రాజెక్టుపై రూ.500 కోట్ల అదనపు భారం పడుతుందని సర్కార్కు నివేదించి టెండర్లు రద్దు చేసింది.
ప్రభుత్వ వ్యూహం మరొకలా..
మళ్లీ ఇలా జరక్కుండా నాలుగు ప్యాకేజీలుగా పనుల్ని విభజించి మళ్లీ టెండర్లు పిలుస్తామని ప్రతిపాదించగా ప్రభుత్వ పెద్దలు స్పందించకుండా తాము చెప్పిన వారికి పనులు ఇవ్వలేదనే ఆగ్రహంతో సంప్రదింపులను సైతం నిలిపివేసింది. పరిస్థితిని వివరించడానికి శ్రీధరన్ ఎన్నిసార్లు అపాయింట్మెంట్ కోరినా సీఎం చంద్రబాబు ఇవ్వలేదు. పైగా విజయవాడకు మెట్రో అనవసరమని, అంత ఖర్చుతో మెట్రో లైన్లు వేయడం కంటే ఫ్లైఓవర్లు కడితే సరిపోతుందని స్వయంగా చంద్రబాబు నెల క్రితం జరిగిన క్యాబినెట్ సమావేశంలో స్పష్టం చేశారు. ఆ తర్వాత ఏఎంఆర్సీ (అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్), మెట్రో స్థానంలో ఎలివేటెడ్ కారిడార్ తీసుకొస్తామని ప్రకటించింది. కొద్దిరోజులకు అది సరిపోదని లైట్ మెట్రో రైలు కావాలని జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థతో సంప్రదింపులు జరిపి సీఎంతో సమావేశం ఏర్పాటు చేయించింది.
శ్రీధరన్ రాజీనామాకు యూపీ సీఎం ఆదిత్యనాథ్ నో
ఈ దశలో చివరిగా గత నెల 5వ తేదీన శ్రీధరన్ ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ లైట్ మెట్రో రైలు (ఎల్ఆర్టీ) విజయవాడకు సరిపోదని, ఇప్పుడు ఉన్న స్థితిలో మెట్రోయే సరైనదని పేర్కొన్నారు. అయినా పట్టించుకోని ముఖ్యమంత్రి ఎల్ఆర్టీ కోసం కేఎఫ్డబ్ల్యూతో సర్వే చేయిస్తుండడంతో మనస్తాపం చెందిన శ్రీధరన్ గత నెల 12వ తేదీన ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తూ లేఖ పంపారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్లోని లక్నో ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకుంటానని లేఖ రాస్తే.. అక్కడి సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ ఒప్పుకోలేదు. కానీ చంద్రబాబు మాత్రం తన స్వప్రయోజనాల కోసం శ్రీధరన్ను తీవ్రంగా అవమానించి రాష్ట్రం నుంచి సాగనంపారని ఆరోపణలు ఉన్నాయి.
చంద్రబాబుకు ఐవీఆర్ లేఖ
ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) అంతులేని రాజకీయాలకు అధికార కేంద్రంగా మారిందని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. సీఎంఓ ఏమాత్రం పారదర్శకత, బాధ్యత లేకుండా నడుస్తుండటం వల్ల పరిపాలనపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. సీఎంఓ బాధ్యతాయుతంగా పనిచేసేలా పరిపాలనా సంస్కరణలు తీసుకురావాలని కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. సమాంతర సచివాలయంగా మారిన సీఎంఓ ఎలాంటి ఫైళ్లు నిర్వహించకపోవడాన్ని తప్పుపట్టారు. ప్రధానమంత్రి కార్యాలయంలో కూడా ప్రధానికి సలహాలు ఇచ్చిన, నోట్ రాసిన వారి సంతకాలు ఉంటాయని, గవర్నర్ కార్యాలయంలో గవర్నర్కు సలహా ఇచ్చిన వారి సంతకం ఉంటుందని ఐవిఆర్ కృష్ణారావు చెప్పారు.
బ్రాహ్మణ సంస్థ చైర్మన్గా ఇలా ఐవీఆర్ తొలగింపు
ఎలాంటి రికార్డులు, బాధ్యత, జవాబుదారీతనం లేకుండా పనిచేస్తున్న ఏకైక కార్యాలయం ఏపీ సీఎంవో ఒక్కటేనని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. సీఎంవోలో పారదర్శకత, బాధ్యత, జవాబుదారీతనం లేవనడానికి ఇవే నిదర్శనమని ఐవైఆర్ కృష్ణారావు దుయ్యబట్టారు. ప్రభుత్వం పనితీరు, మంత్రుల వ్యవహార శైలిపై విమర్శలు గుప్పించినందుకు తాను ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవీఆర్ కృష్ణారావును ఆగమేఘాల మీద తొలగించిన నేపథ్యం ఏపీ సీఎం చంద్రబాబుది.
ఫైళ్ల పుటప్ కోసం సెక్షన్ ఆఫీసర్లు చాలని సూచన
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఐవీఆర్ కృష్ణారావు లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఎలాంటి నియంత్రణ లేని పద్ధతుల్లో సీఎంఓ పనితీరుతో ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని ఏపీ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో ఐవిఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. ఉన్నతాధికారులను పక్కన పెట్టి కిందిస్థాయి వారి నుంచి తమకు కావాల్సిన రీతిలో ఫైళ్లు తెప్పించుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి పరిశీలన కోసం ఫైల్ పంపండని రాయడానికే సీఎంఓ అధికారులు ఉన్నట్లయితే ఇందుకు ఐఏఎస్ అధికారులు అవసరం లేదని, ఎలాంటి బాధ్యత, జవాబుదారీతనం లేకుండా కేవలం ఫైల్ పుటప్ అని రాసి విభాగాలకు పంపడం ద్వారా సీఎంకు సహాయపడేందుకు సెక్షన్ ఆఫీసర్లు సరిపోతారన్నారు.