భారీ వరదలు: వంశధారలో చిక్కుకున్న 53మంది కూలీలు
శ్రీకాకుళం: ఎగువన కురిసిన భారీ వర్షాలు కారణంగా శ్రీకాకుళం జిల్లా వంశధార నదిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గొట్టా బ్యారేజ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. సమాచారం లేకపోవడంతో ఈ వరద నీటి ప్రవాహానికి సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం రేవు ఇసుక ర్యాంప్ వద్ద ఇరువై లారీలు, 2 జేసీబీలు చిక్కుకుపోయాయి.
లారీలో ఇసుక నింపటానికి వెళ్లిన లారీలు, జేసీబీల డ్రైవర్లతోపాటు 53 మంది కూలీలు కూడా వరద నీటిలో చిక్కుకుపోయారు. ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలకు ప్రారంభించారు.
24 మందిని కూలీలను అధికారులు కాపాడారు. అయితే క్రమేణా వరద ఉధృతి పెరగడంతో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. మిగిలిన వారిని కాపాడేందుకు అధికారులు విశాఖపట్నం ప్రత్యేక నేవీ సిబ్బంది సహాయం కోరారు. బోట్లను సిద్ధం చేశామని, రెవెన్యూ, అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలను చేపడుతున్నట్లు డీఎస్పీ భీమారావు తెలిపారు.