కేంద్రంపై ఒత్తిడి: మోడీకి తెలిసినా, గల్లా జయదేవ్ కూడా: ఎంపీ రామ్మోహన్ నాయుడు
న్యూఢిల్లీ: విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చే వరకు పోరాడుతామని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు, టీడీపీ యువనేత రామ్మోహన్ నాయుడు శుక్రవారం చెప్పారు. ఆయన లోకసభలో రైల్వే జోన్ విషయమై ప్రయివేటు మెంబర్ బిల్లు ప్రవేశ పెట్టారు.
చదవండి: 'స్వరం మార్చిన రోజా, జగన్కు ఇబ్బందులు మొదలు, రాత్రుళ్లు మాట్లాడుకుంటున్నారు'
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన జరిగి మూడున్నరేళ్లు దాటినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని, అందుకే తాము ప్రయివేటు మెంబర్ బిల్లు పెట్టామని చెప్పారు. పార్లమెంటులో తమ (టీడీపీ) వాదన వినిపించాలనే బిల్లు పెట్టినట్లు చెప్పారు.
చదవండి: బైరెడ్డిని రమ్మన్న బాబు: టీడీపీలోకి మరో కీలక నేత, జగన్కు అలా దెబ్బమీద దెబ్బ
అన్ని మార్గాలతో పోరాడుతాం
రైల్వే చట్టం 1989 సవరించి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ను ఏర్పాటు చేయాలని విభజన బిల్లులో పేర్కొన్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. రైల్వే జోన్తో పాటు విభజన హామీలు అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరతామన్నారు. తమకు ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకొని రాష్ట్రానికి న్యాయం చేసేందుకు పోరాడుతామని చెప్పారు.
లాటరీ విధానం కాబట్టి చర్చ, మేం సిద్ధం
రైల్వే జోన్ సాధనకు టీడీపీ ఎంపీలం అందరమూ పోరాడుతున్నారని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ప్రయివేటు బిల్లు పెట్టే అవకాశం రావడం ఆనందం అన్నారు. కేంద్రం నుంచి సరైన స్పష్టత రాలేదని, అందుకే తమ ప్రయత్నంలో భాగంగా రైల్వే జోన్పై చర్చ జరగాలని బిల్లు పెట్టామన్నారు. లాటరీ విధానంలో చర్చకు అనుమతిస్తారు కాబట్టీ త్వరలోనే బిల్లు సభముందుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చకు వచ్చినప్పుడు మాత్రం ఈ డిమాండ్ సాధనకు తమ వాదనను గట్టిగా వినిపిస్తామన్నారు. రైల్వే జోన్ ఎందుకు కావాలి? విశాఖలోనే ఎందుకు అడుగుతున్నామో కేంద్రానికి స్పష్టంగా చెబుతామన్నారు.
మోడీకి తెలిసినా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు
ఏపీ ప్రజల సెంటిమెంట్ను కేంద్రానికి స్పష్టం చేస్తామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, గతంలో రైల్వే మంత్రులుగా పనిచేసిన వారు, ప్రస్తుత రైల్వే మంత్రి దృష్టిలో ఈ అంశం ఉన్నప్పటికీ దీనిపై రాజకీయ నిర్ణయం తీసుకోలేకపోతున్నారన్నారు.
ఈ బిల్లు ద్వారా మా పోరాటం, జయదేవ్ కూడా
విశాఖ రైల్వే జోన్ కోసం, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను సాధించేందుకు ఎంత గట్టిగా పోరాడుతున్నామో కేంద్రానికి ఈ బిల్లు ద్వారా వెల్లడిస్తామని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఎంపీ గల్లా జయదేవ్ కూడా ప్రయివేటు మెంబర్ బిల్లు పెట్టారని తెలిపారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు, రైల్వే జోన్ అంశాన్ని ప్రస్తావిస్తూ జయదేవ్ బిల్లును ప్రవేశపెట్టారన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం అన్ని విధాలుగా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. వీలైనంత త్వరలో ఈ బిల్లు చర్చకు వస్తే పాల్గొనేందుకు అన్ని విధాలా తాము సిద్ధమన్నారు.
కేంద్రంపై ఒత్తిడి
కాగా, రైల్వే జోన్ ఏర్పాటు కోసం టీడీపీ కేంద్రంపై ఒత్తిడి పెంచుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా రామ్మోహన్ లోకసభలో శుక్రవారం ప్రయివేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. 1989 రైల్వే చట్టానికి సవరణ కోరుతూ ఈ బిల్లును ప్రతిపాదించారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వాల్తేరు, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు రైల్వే డివిజన్లతో కలిపి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసేందుకు బిల్లును ప్రవేశపెట్టేందుకు తనకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన గతంలో రాసిన లేఖకు కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో బిల్లు పెట్టారు.