మోడీ అక్కడే ప్రధాని కాదు, బాబు పిలిచినా జగన్ రాలేదు: రామ్మోహన్ నాయుడు నిప్పులు
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ రామ్మోహన్ నాయుడు రైల్వే స్టేషన్లో నిరసన దీక్ష చేపట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఆయన సోమవారం రాత్రి ఏడు గంటల నుంచి ఆముదాలవలస పట్టణంలోని శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్లో దీక్ష ప్రారంభించి, ఉదయం ముగించిన విషయం తెలిసిందే.
హరిబాబు రాజీనామా, బీజేపీ లెక్కలు: బాబుకు షాక్, తెరపైకి పురంధేశ్వరి? రేసులో వీరే!
ఆ తర్వాత ఆయన ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన నిప్పులు చెరిగాు. యూపీఏ నాడు ఇష్టం వచ్చినట్లుగా విభజించిందని, ఇప్పుడు బీజేపీ మోసం చేసిందన్నారు. ఏపీకి రైల్వే జోన్ ఇవ్వాలని ఒడిశా ముఖ్యమంత్రి చెప్పినా కేంద్రం ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నించారు. వైసీపీ రాజీనామాలు దొంగాట అన్నారు.
మోడీ అక్కడే ప్రధాని కాదు
ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ మాత్రమే నరేంద్ర మోడీ ప్రధాని కాదని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ఆయన 132 కోట్ల మంది ప్రజలకు ప్రధాని అన్నారు. రైల్వే జోన్ తదితర ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఏపీకి ఏం చేశారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఎందుకు కుట్రలు చేస్తున్నారన మండిపడ్డారు. రెండు నెలలుగా తాము నిరసనలు వ్యక్తం చేస్తున్నామని, పార్లమెంటులో, మోడీ నివాసం వద్దకు వెళ్లి నిరసనలు తెలిపామన్నారు.
మా చేతిలో లేదనే దీక్ష
చంద్రబాబు దీక్షపై మాట్లాడుతూ.. తాము తెలుగు పౌరులుగా, బాధ్యత కలిగిన నాయకులుగా ఏపీ కోసం దీక్ష చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. పార్లమెంటు సరిగా నడవలేదని మోడీ దీక్ష చేశారని, కానీ అందుకు ఆయనే బాధ్యులు అన్నారు. అన్నాడీఎంకే వాళ్లు కావేరీ బోర్డు కోసం దీక్ష చేశారని, అది కేంద్రం చేతిలోనే ఉంది కదా అన్నారు. కానీ మా చేతిలో లేని దాని కోసం (ప్రత్యేక హోదా) తాము దీక్ష చేస్తున్నామని చెప్పారు. ప్రధాని, పార్లమెంటులో ఇచ్చిన హామీలు అమలు చేయాలని దీక్ష చేయడంలో తప్పు లేదన్నారు. తమ దీక్షలో రాజకీయం లేదన్నారు.
చంద్రబాబు ఆహ్వానించినా రాలేదు
ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి జేఏసీగా ఏర్పడి పోరాటం చేద్దామని వైసీపీ, జనసేన, ఇతర పార్టీలకు చంద్రబాబు నాయుడు ఎప్పుడో పిలుపునిచ్చారని రామ్మోహన్ నాయుడు చెప్పారు. కానీ వైసీపీ రాజీనామాలు చేసి డ్రామాలు చేసిందన్నారు. వైసీపీకి చెందిన లోకసభ ఎంపీల రాజీనామా చేశారని, మరి రాజ్యసభ సభ్యులు ఎందుకు చేయలేదని నిలదీశారు. లోకసభ ఎంపీలు చేసిన రాజీనామాలు కూడా చివరి రోజు ఇచ్చారని, వాటిని ఆమోదించుకోవాలని సవాల్ చేశారు.
అందరూ రాజీనామా చేస్తే మోడీని నిలదీసేదెవరు?
తమను కూడా రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోందని, కానీ అందరం రాజీనామా చేస్తే ప్రధాని పార్లమెంటులో అడుగుపెట్టినప్పుడు, ఢిల్లీలో అడుగుపెట్టినప్పుడు ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాడుతారని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. హోదాపై వైసీపీ నాయకులు మోడీని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. చంద్రబాబు కలిసి పోరాడుదామన్నా రావడం లేదన్నారు.
ఒడిశా చెప్పినా రైల్వే జోన్ ఎందుకివ్లట్లేదు?
విశాఖ రైల్వే జోన్కు ఒడిశా అంగీకరించిందని, అలాగే ఆంధ్రప్రదేశ్ అడుగుతోందని, అలాంటప్పుడు కేంద్రం ఎందుకు ఒప్పుకోవడం లేదని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. ఒడిసాలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తోందన్నారు. ఇదిలా ఉండగా, చంద్రబాబు, టీడీపీ నేతలు ఈ నెల 20న హోదా కోసం దీక్ష చేయనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పార్టీ సమన్వయ కమిటీ భేటీలో చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎంగా ఉంటూ ఎవరైనా దీక్షలు చేసిన వారు ఉన్నారా అని అడిగారు. వివిధ సందర్భాల్లో మోడీ, శివరాజ్ సింగ్ చౌహాన్, కేజ్రీవాల్ వంటి వారు చేశారని మంత్రులు చెప్పారు.