వైసీపీvsటీడీపీ: భయానక ‘దేవుడి’ మిస్టరీ.. ఆ గుడి జోలికి వెళితే అంతే.. పోలీస్ స్టేషన్పై నుంచి దూకి..
అదొక పురాతన శివాలయం.. అదున్న చోటు కూడా చాలా చిన్నదే.. మహా అయితే 10 అడుగుల విస్తీర్ణం.. మహిమగల ఆలయంగా పేరున్నప్పటికీ.. దాని చుట్టూ విచిత్రమైన కథలెన్నో ప్రచారంలో ఉన్నాయి.. ఆ ఆలయాన్ని ఎవరైనా తెరవాలని చూసినా.. పునరుద్ధరణకు ప్రయత్నించినా ప్రాణాలు పోవడం ఖాయమని స్థానికులు చెబుతుంటారు.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం, ఎస్ఎం పురం గ్రామంలోని ఆ శివాలయ మిస్టరీనే.. ఇప్పుడు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య భయానక పరిస్థితులకు దారితీసింది.
ఫేస్బుక్ లైవ్లో ఆత్మహత్యకు..
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ బిల్డింగ్ పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్టేషన్ లో ఆత్మహత్యాయత్నం చేసిన ఆ వ్యక్తి ఎవరో కాదు.. ఎస్ఎం పురం మాజీ సర్పంచ్, టీడీపీ కీలక నేత చౌదరి అవినాష్. అతను శ్రీకాకుళం జిల్లా జడ్పీ మాజీ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మీ ఏకైక కుమారుడు కూడా. బిల్డింప్ పై నుంచి దూకడానికి రెండు నిమిషాల ముందు ఫేస్ బుక్ లైవ్ లో అతనో వీడియో పోస్ట్ చేశాడు..
వైసీపీ వచ్చాక తారుమారు..
టీడీపీ అధికారంలో ఉండగా.. 2016లో ఎస్ఎన్ పురం గ్రామంలోని ఆ పురాతన శివాలయం పునరుద్ధరణకు పనలు మొదలుపెట్టానని అవినాష్ తెలిపాడు. మూడున్నరేళ్లలో ఆలయ నిర్మాణం 90 శాతం వరకు పూర్తయిందని.. అంతలోనే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో పరిస్థితలన్నీ తారుమారాయ్యాయని పేర్కొన్నాడు. ‘‘ఆ గుడి కట్టినవాళ్లు చనిపోతారనే ప్రచారాన్ని మొదట్లో నేను నమ్మలేదు. దేవుడి పని చేస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసించాను. కానీ విధిరాత వైసీపీ రూపంలో నాతో ఆడుకుంటుందని అనుకోలేదు. ప్రచారంలో ఉన్న పుకార్లను వైసీపీ నేతలు, వాళ్లమాటవింటోన్న పోలీసులు అక్షరాలా నిజం చేశారు..''అని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇక ఆ ఊళ్లో ఉండొద్దు..
‘‘వైసీపీ అధికారంలోకి వచ్చాక గుడి నిర్మాణానికి అడుగడుగునా అడ్డం పడింది. ఎచ్చర్ల ఎమ్మెల్యే(గొర్లె కిరణ్ కుమార్), ఎచ్చర్ల స్టేషన్ సీఐ, ఎస్ఐ ముగ్గురూ కలిసి నన్ను దారుణంగా వేధించారు. నేను కష్టపడి నిర్మించిన గుడికి వాళ్లు స్వాధీనపర్చుకున్నారు. నన్నుగానీ, మావాళ్లను గానీ గుడి దరిదాపుల్లోకి రానివ్వడంలేదు. అసలు గుండెందుకు కట్టావంటూ విచారణ పేరుతో కొన్ని నెలలుగా వేధిస్తున్నారు. పోలీసులే దగ్గరుండి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఆ శివాలయాన్ని కట్టినవాళ్లు చనిపోతారన్న మాటను వైసీపీ, పోలీసులు నిజం చేస్తున్నారు. వాళ్ల కారణంగానే నేను చనిపోవాలనుకుంటున్నాను. ఆ ఊళ్లో ఉండొద్దని మా కుటుంబాన్ని కోరుతున్నాను. అక్కడ జనాలు కూడా సరిగాలేరిప్పుడు..''అని లైవ్ కట్ చేసిన వెంటనే అవినాష్ స్టేషన్ బిల్డింగ్ పై నుంచి కిందికి దూకాడు..
కిమ్స్లో కొనప్రాణాలతో..
టీడీపీ నేత అవినాష్ ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పైనుంచి దూకిన దృశ్యాలు టీవీల్లో ప్రసారమయ్యాయి. రెండో అంతస్థు నుంచి దూకగా.. మొదటి అంతస్థు పిట్టగోడ తాకి తలకిందులుగా కారుపై పడిపోయాడు అవినాష్. తీవ్రంగా గాయపడ్డ ఆయనను హుటాహుటిన శ్రీకాకుళం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. అవినాష్ ఆత్మహత్యాయత్నం వార్త తెలిసిన వెంటనే జిల్లా టీడీపీ నేతలు కిమ్స్ వైపు పరుగులు తీశారు.
Recommended Video
ఇదీ అవినాష్ నేపథ్యం..
శ్రీకాకుళం జడ్పీ మాజీ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మీ వారసుడిగా టీడీపీలోనే తన ప్రస్థానం ప్రారంభించిన అవినాష్.. కొద్దికాలంలోనే జిల్లాలో కీలక నేతగా ఎదిగాడు. ఎస్ఎన్ పురం సర్పంచ్ గా గెలిచిన తర్వాత అతని దృష్టి పురాతన శివాలయంవైపు మళ్లింది. కుటుంబీకులు కూడా వద్దని వారించినా అవినాష్ మొండిగా ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అతనికి భార్య, ఒక కూతురు ఉన్నారు. అవినాష్ ఆత్మహత్యాయత్నంతో జిల్లా రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.