జగన్ పిరికిపంద-ఢిల్లీ టూర్ రద్దుపై రామ్మోహన్ నాయుడు అనుమానాలు-పాదయాత్రకు బెణకని కాలు....
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీసా సాగిపోతున్న పోరులో నిత్యం మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో తాజాగా శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీంతో పాటు సీఎం జగన్ ఢిల్లీ టూర్ రద్దుపైనా తనదైన రీతిలో స్పందించారు. ఏపీలో డ్రగ్స్ మాఫియా పెరిగిపోతున్నా చర్యలు తీసుకోవాల్సిన డీజీపీ.. టీడీపీ నోరు మూయించాలని చూడటమేంటని ప్రశ్నించారు.
సీఎం జగన్ ఢిల్లీ టూర్ చివరి నిమిషంలో రద్దు కావడంపై శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా బెణకని కాలు.. ఇప్పుడు ఢిల్లీ టూర్ అనగానే ఎందుకు బెణికిందని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ ఓ పిరికిపందని రామ్మోహన్ నాయుడు సంచలన విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా గురించి జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. కేంద్రాన్ని ప్రత్యేక హోదా గురించి అడగకుండా తాడేపల్లిలో తలదాచుకుంటున్నారని రామ్మోహన్ నాయుడు విమర్శించారు.
ఏపీలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నా నియంత్రించాల్సిన పోలీసులు చోద్యం చూస్తున్నారని ఎంపీ రామ్మోహన్ తెలిపారు. ప్రశ్నిస్తున్న టీడీపీ నేతల్ని మాట్లాదొద్దని చెప్పడానికి డీజీపీ ఎవరని ఆయన ప్రశ్నించారు. ఏ అంశంపై అయినా టీడీపీ గాలి మాటలు మాట్లాడదని, సాక్ష్యాధారాలతోనే విమర్శలు చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. పోలీసు అధికారులు ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తుంటే ప్రతిపక్షానికి వ్యవస్ధపై నమ్మకం ఎలా కలుగుతుందన్నారు. ఖాకీ దుస్తులు వేసుకుని సేవ చేయాల్సింది ప్రజలకు కానీ పార్టీలకు కాదని డీజీపీకి ఎంపీ రామ్మోహన్ చురకలు అంటించారు.
ఆప్ఘన్ నుంచి ఏపీకి హెరాయిన్ లింకులు ఉన్నాయని తాము చెబితే విమర్శలు చేశారని, ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడితో లింకులు ఎలా బయటపడ్డాయని ఎంపీ రామ్మోహన్ పోలీసుల్ని ప్రశ్నించారు. ఆప్ఘన్ నుంచి వచ్చిన హెరాయిన్ ఈ-వే బిల్లులు తీస్తే అసలు నిందితులు ఎవరో బయటపడతారని ఆయన సూచించారు. రాష్ట్రంలోకి డ్రగ్స్ వస్తుంటే, ఇక్కడి నుంచి బ్లాక్ మనీ ఎగుమతి అవుతోందని, అయినా పోలీసులు మాత్రం దర్యాప్తుకు వెనకాడుతున్నారని రామ్మోహన్ నాయుడు విమర్శించారు.