సోషల్ మీడియాపై ఉన్న శ్రద్ధ.., టీపీఎస్ గా మార్చారు, ఎస్పీ ఏం చేస్తున్నారు? :శ్రీకాంత్రెడ్డి
సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన వాళ్లను రాత్రికి రాత్రే అరెస్టు చేయించే టీడీపీ ప్రభుత్వం..
హైదరాబాద్: సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన వాళ్లను రాత్రికి రాత్రే అరెస్టు చేయించే టీడీపీ ప్రభుత్వం.. రాజకీయ హత్యలపై కనీసం స్పందించకపోవడం దారుణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు.
మంగళవారం వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కర్నూలు ఎస్సీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి నారాయణరెడ్డి హత్య జరిగి 48 గంటలైనా దోషులను ఎందుకు పట్టుకోలేకపోయారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతున్నదని విమర్శించారు.
'సోషల్ మీడియాలో చిన్న కామెంట్లు పెడితేనే అరెస్టులు చేస్తున్నారు. అలాంటిది ప్రతిపక్షానికి చెందిన కీలక నేతను అతికిరాతకంగా హత్య చేస్తే దోషులను అరెస్ట్ చేయరా? కర్నూలు ఎస్పీ ఏం చేస్తున్నట్లు? ఈ వ్యవహారంపై డీజీపీ జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వానికి సోషల్ మీడియాపై ఉన్న శ్రద్ధ శాంతిభద్రతలపై లేదు.' అని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అధికార టీడీపీకి కొమ్ముకాస్తున్న కొందరు ఆఫీసర్లు.. ఇండియన్ పోలీస్ సర్వీసెస్(ఐపీఎస్)ను తెలుగుదేశం పోలీస్ సర్వీసెస్(టీపీఎస్)గా మార్చారంటూ శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. పశ్చిమ గోదావరికి చెందిన ఓ ఎస్సైపై దైర్జన్యం జరిగినా కేసు పెట్టలేని విషయాన్ని గుర్తుచేస్తూ.. 'ఎంతకాలం అవమానాలకు గురవుతారు? ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రజల కోసం పని చేస్తూ దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాలి' అని వ్యాఖ్యానించారు.