డాడీ దగ్గరే ఉంటా: బైబై వెళ్లిపోతున్నా అంటూ వాయిస్ రికార్డు
చిత్తూరు: శ్రీకాంత్ రెడ్డి అనే 27 ఏళ్ల యువకుడి ఆత్మహత్య అందరినీ కలతకు గురి చేసింది. తండ్రి మరణంతో డీఈవోలో వచ్చిన అటెండర్ ఉద్యోగంలో ఇమడలేకనే డి.శ్రీకాంత్రెడ్డి (27) ఆత్మహత్యకు పాల్పడినట్టు తేలింది.
మృతుని తల్లి డి.రమాదేవి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఈ విషయం చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఇన్చార్జ్ ఎస్ఐ కేవీహెచ్ నాయుడు శుక్రవారం తెలిపారు. శ్రీకాంత్రెడ్డి మిత్రులతో ఆనందంగా గడిపేవాడ. టీచరైన తండ్రి వెంకటరెడ్డి ఏడాదిన్నర క్రితం మరణించాడు.
దాంతో శ్రీకాంత్రెడ్డికి డీవోఈ కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం వచ్చింది. ఏడు నెలలుగా విధుల్లో ఉన్నప్పటికీ అందులో ఇమడలేకపోయాడు. తల్లితో ఫోన్లో ఇదే విషయం చెబుతూ వచ్చాడు. కొంత కాలం పనిచేస్తే అదే అలవాటవుతుందని ఆమె సర్దిచెబుతూ వచ్చంది. అయితే, చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు.
కడప జమ్మలమడుగు సమీపంలోని పెద్దపసుపులకు చెందిన డి.వెంకటరెడ్డి ఉద్యోగ రీత్యా బి.కొత్తకోట మండలం గుంతావారిపల్లెకు వచ్చారు. ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. పీటీఎం మండలంలో పనిచేస్తూ ప్రమాదంలో మరణించారు.
ఆయన మృతదేహాన్ని గుంతావారిపల్లె సమీపంలోని భూమిలో సమాధి చేశారు. బుధవారం రాత్రి కొడుకు ఉరి వేసుకొని మృతిచెందాడు. ఆత్మహత్య లేఖలో డాడీ దగ్గరే ఉంటానని రాసినట్టుగానే శ్రీకాంత్రెడ్డి మృతదేహాన్ని తండ్రి సమాధి ఎదుటే పూడ్చారు.
బుధవారం రాత్రి సారీ మా, బైబై వెళ్లిపోతున్నా అంటూ పంపిన వాయిస్ రికార్డు విన్నప్పటి నుంచి మిత్రులు శ్రీకాంత్ రెడ్డితో మాట్లాడేందుకు ఫోన్లో ప్రయత్నించారు. అయితే, ఫలితం కనిపించలేదు.. శుక్రవారం అంత్యక్రియలు ముగిసే వరకు సుమారు 40 మంది మిత్రులు వెంటే ఉన్నారు.