జనం సొమ్ము తినడంపైనే బాబు ఆలోచనలు: శ్రీకాంత్, దాడిని ఖండించిన ఉమ్మారెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పప్పుల ధరలు ఆకాశన్నంటినా నీరో చక్రవర్తిలా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం పప్పుదినుసు పంటలను ప్రోత్సహించడం లేదని ఆరోపించారు.
‘జనం సొమ్ము ఎలా తినాలి, ఎంత తినాలి' అనేదానిపైనే చంద్రబాబు ఆలోచనలున్నాయని, ప్రజలు ఏం తింటున్నారనే ఆలోచన ఆయనకు లేనే లేదని మండిపడ్డారు. రైతులు ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో వేస్తున్నారనే సమాచారం ప్రభుత్వం దగ్గర లేదని, ఇలా ముందస్తు ఆలోచన లేకపోవడం వల్లే నేడు ఇబ్బందులు వచ్చాయని చెప్పారు.
గతంతో పోలిస్తే పప్పు పంటల దిగుమతులు తగ్గిపోయాయని ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని చెప్పారు. 90శాతం కందిపప్పు భారత్ లోనే ఉత్పత్తి అవుతుందని, అయినా, రైతులకన్నా దళారులే ఎక్కువగా లాభపడుతున్నారని చెప్పారు.
కూరగాయల ధరలు 150శాతం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. పప్పు దినుసుల పంటలను ప్రభుత్వం ప్రోత్సహించడంలేదని, ఈ పంటల విషయంలో నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగా చేశారని చెప్పారు.
విద్యార్థులపై బీజేపీ నేతలు దాడి చేయడం తప్పు: ఉమ్మారెడ్డి
విజయవాడలో భారతీయ జనతా పార్టీ నేతలు విద్యార్థులపై దాడి చేయడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఖండించారు. ప్రజస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని అన్నారు. బిజెపి కార్యాలయం ఎదుట విద్యార్థులు నిరసన తెలపడం తప్పుకాదని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు.
ఏపికి వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన జేఏసీ నాయకులు విజయవాడలోని బిజెపి కార్యాయం ఎదుట నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా.. బిజెపి నాయకులు అడ్డుకుని వారిపై దాడి చేసిన నేపథ్యంలో ఉమ్మారెడ్డి పైవిధంగా స్పందించారు.