బాధ్యతా రాహిత్యం: బాబుపై శ్రీకాంత్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని అన్నారు.
సోమవారం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్రతి ముగ్గురి పిల్లల్లో ఒకరు పౌష్టికాహార లోపంతో పుడుతున్నారన్నారు. అదే విధంగా అక్షరాస్యతలోనూ వెనుకబడ్డామని ఆయన తెలిపారు. ఇలాంటి అంశాలపై దృష్టి సారించాల్సిన సిఎం బాధ్యతా రహితంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని అన్నారు.
ఉపాధి, ఆహార భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
జగన్ దీక్షకు తరలిరావాలి: ఆళ్లనాని
ఏలూరు: సిఎం చంద్రబాబును నిలదీసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ చేపట్టిన దీక్షకు భారీగా ప్రజలు తరలిరావాలని ఆ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు ఆళ్లనాని పిలుపునిచ్చారు. మోసపూరిత వాగ్ధానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబును ప్రజలు నిలదీయాలని అన్నారు.
జగన్ దీక్షకు మద్దతివ్వాలి: ఏపి బిసి సంఘం
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్షకు బీసీలంతా మద్దతు తెలపాల్సిన అవసరముందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అధ్యక్షుడు బేరంగుల ఉదయ్ కిరణ్ అన్నారు. ఎన్నికల సమయంలో బీసీ వర్గీకరణ చేపడతానని చెప్పి అధికారంలోకి రాగానే చంద్రబాబునాయుడు మాటతప్పారని ఆరోపించారు. బీసీలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు పర్చడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు.