భయంతో చంద్రబాబు డ్రామాలు, అందుకే యూటర్న్: శ్రీకాంత్ రెడ్డి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను వంచించడానికి ఎన్నో కుట్రలు చేస్తున్నారని, చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలోని ముంపు మండలాలనలను ఎపిలో విలీనం చేయకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని చెప్పిన చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో అలా ఎందుకు చేయలేదని అడిగారు
తమ పార్టీ పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేస్తామని అనగానే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని, ప్రత్యేక హోదాపై తమ పార్టీకి క్రెడిట్ వస్తుందనే భయంతో చంద్రబాబు డ్రామాలు ఆడడం ప్రారంభించారని అన్నారు.
ఎంపీలను ప్రశ్నించిన శ్రీకాంత్ రెడ్డి
హిమాచల్ ప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు సుజనా చౌదరి, గల్లా జయదేవ్ ఎందుకు పెట్టుబడులు పెట్టారో చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర రుణాలను 90 వేల కోట్లు చేసింది చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయానుభవమేనా అని ఆయన అడిగారు ఎవరికీ భయపడను అంటూనే కేసులకు చంద్రబాబు భయపడుతున్నారని ఆయన అన్నారు.
బాబును మించిన ఆర్థిక నేరగాడు లేడు..
ఈ దేశంలో చంద్రబాబును మించిన ఆర్థిక నేరగాడు లేడని, అందుకే బిజెపి చంద్రబాబును దూరంగా పెడుతోందని శ్రీకాంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చిత్తశుద్ధికి తాము గర్వపడుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదాకు ఎవరు మద్దతు ఇస్తారో వారితో కలిసి పోరాడుతామని చెప్పారు.
చంద్రబాబు తీరు హాస్యాస్పదం
ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ నాలుగేళ్లుగా ఆందోళనలు చేస్తుంటే తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు హోదా కోసం పోరాటం చేస్తానని అనడం హాస్యాస్పదమని వైసిపి ఎమ్మెల్సీ వీరభద్ర స్వామి అన్నారు. హోదా విషయంలో చంద్రబాాబు ప్రవర్తన విచిత్రంగా ఉందని అన్నారు.
సంజీవిని కాదని చంద్రబాబు అన్నారు...
హోదా కోసం కలిసి రావాలని అడిగితే హోదా సంజీవిని కాదని చంద్రబాబు అన్నారని, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబుకు నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు లేదని వీరభద్రస్వామి అన్నారు. 2014 ఎన్నికల్లో టిడిపికి ఓటేయాలని అడిగిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తప్పులు ఎత్తి చూపుతుంటే ఎదురుదాడి చేస్తున్నారని ఆయన అన్నారు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే....
రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ఏనాడూ పనిచేయని చంద్రబాబు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని వీరభద్రస్వామి విమర్శించారు. నాలుగేళ్లుగా ఎవరు హోదా కోసం పోరాడుతున్నారో ప్రజలకు తెలుసునని, ప్రజలు చంద్రబాబును క్షమించబోరని అన్నారు. నాలుగేళ్లుగా కేంద్రంతో చంద్రబాబు లాబీయింగ్ చేశారని అన్నారు. కేంద్రంలో లాబీయింగ్ చేయాల్సిన అవసరం జగన్కు లేదని అన్నారు.
అంత మొత్తం ఎలా సంపాదించారు...
నాలుగేళ్లుగా చంద్రబాబు పాలన అంతా అవినీతిమయంగా మారిందని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు ఐజయ్య ఆరోపించారు. కేవలం రెండు ఎకరాల ఆసామి అయిన చంద్రబాబుకు లక్లల వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై పూటకో మాట మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు.
మళ్లీ చంద్రబాబు యాటర్న్
తమ పార్టీ ప్రతిపాదించే అవిశ్వాసానికి మద్దతు ఇస్తానని చెప్పిన చంద్రబాుబ మళ్లీ యూటర్న్ తీసుకున్నారని ఐజయ్య విమర్శంచారు. బిజెపితో కాపురం చేసి 29 సర్లు ఢిల్లీకి వెళ్లానని చెబుతున్న చంద్రబాబు ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆ బంధమేదో చెప్పాలి..
శేఖర్ రెడ్డికి, నారా లోకేష్కు మధ్య ఏం సంబంధం ఉందో చంద్రబాబు బయటపెట్టాలని ఐజయ్య డిమాండ్ చేశారు. శేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని లోకేష్ వేల కోట్లు సంపాదించారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం సోమవారం పార్లమెంటులో చేపట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ప్రజా సంకల్ప మానవహారం నిర్వహిస్తామని ఆయన చెప్పారు.