70సార్లు ఆ సినిమా చూశా: డీజీపికి కిక్ ఇచ్చిన మహేష్ మూవీ, డైలాగ్తో అదరగొట్టారు..
'అందరూ వాడు పుట్టాడ్రా, వీడు పుట్టాడ్రా అంటారుగానీ, మంచోడు పుట్టాడ్రా నాకు' అన్న డైలాగ్ డీజీపీ స్వయంగా చెప్పడం విశేషం.
విజయవాడ: మంచి సినిమాకు మౌత్ టాక్ ఎప్పుడూ ఉంటుంది. అందులోని డైలాగ్స్ నిత్య జీవితంలోను పాపులర్ అవుతుంటాయి. ఏపీ డీజీపీ సాంబశివరావు నోటి వెంట వచ్చిన డైలాగ్స్ వింటే ఇది నిజమనిపించకమానదు. పోలీస్ కుటుంబాల విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందించే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. శ్రీమంతుడు సినిమాలోని డైలాగ్ తో ఆకట్టుకున్నారు.
పోలీస్ కుటుంబాల విద్యార్థులకు పలు సలహాలు, సూచనలు ఇస్తూ ప్రసంగం మధ్యలో డీజీపీ శ్రీమంతుడు సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు. మహేష్ బాబు హీరోగా నటించిన 'శ్రీమంతుడు' చిత్రం తనకెంతో నచ్చిందని డీజీపీ వ్యాఖ్యానించారు. ఆ సినిమాను తాను 70 సార్లు చూసి ఉంటానని చెప్పారు.
సినిమా క్లైమాక్స్ లో జగపతిబాబు చెప్పే ఓ డైలాగును ఈ సందర్భంగా డీజీపీ చెప్పడం విశేషం. 'అందరూ వాడు పుట్టాడ్రా, వీడు పుట్టాడ్రా అంటారుగానీ, మంచోడు పుట్టాడ్రా నాకు' అన్న డైలాగ్ తో డీజీపీ ఆకట్టుకున్నారు. శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పోలీసుల విధి విధానాల గురించి కూడా ఆయన మాట్లాడారు.
విద్యార్థులు తమను తాము సరిదిద్దుకోవాలని డీజీపీ సూచించారు. విద్యార్థులు మత్తుకు బానిసవుతున్నారంటే.. అందులో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంటుందన్నారు.. పోలీసులు తమ పిల్లల్ని మిగతావారికన్నా అత్యుత్తమంగా పెంచాలన్నారు.