ఎవరీ శ్రీనివాస్?: జగన్ అభిమానా? టీడీపీ అనుచరుడా? ఈ ఫొటోల సంగతేంటి?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన శ్రీనివాసరావు విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికార టీడీపీ మంత్రులు, నేతలు అతను జగన్మోహన్ రెడ్డి అభిమాని అని అంటుండగా.. వైసీపీ నేతలు మాత్రం అభిమాని అయితే అభిమాన నేతపై దాడి ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలోనే సోషల్ మీడియాలో ఇరుపార్టీల నేతలో ఉన్న కొన్ని శ్రీనివాస్ ఫొటోలు వైరల్ అయ్యాయి.
విశాఖ ఎయిర్పోర్టులో వైయస్ జగన్పై కత్తితో దాడి: రక్తంతో తడిసిన షర్ట్, రోజా వార్నింగ్, కంటతడి
జగన్కు వీరాభిమాని అని..
కాగా, జగన్కు శ్రీనివాస్ వీరాభిమాని అని అతను పని చేస్తున్న రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ తెలిపారు. అతనికి ఎలాంటి క్రిమినల్ బ్యాంక్ గ్రౌండ్ లేదన్నాడు. మానసికంగా బాగానే ఉన్నాడని.. ఎవరో కుట్రపూరితంగా దాడి చేయించారనిపిస్తోందని చెప్పాడు. తమ రెస్టారెంట్లో కనీసం ఫోన్ను కూడా అనుమతించమన్నాడు హర్షవర్ధన్.
ఇవే రుజువులు?
అంతేగాక, జగన్ వీరాభిమాని అనడానికి రుజువుగా ఈ ఏడాది న్యూఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా తయారు చేయించిన ఫ్లెక్సీ ఒకటి వైరల్ అవుతోంది. దానిలో జగన్తో పాటు శ్రీనివాసరావు ఫొటోలు ఉన్నాయి. చంటి అనే పేరు ఫ్లెక్సీలో ఉంది. తను, జగన్ల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా ఫ్లెక్సీ రూపొందించారు. అయితే దీనిలో ఎంత వరకు నిజానిజాలున్నాయో తెలియాల్సి ఉంది.
టీడీపీ నేతకు సన్నిహితుడు కూడా...
ఇది ఇలా ఉంటే, మరో వాదన ప్రకారం.. వైయస్ జగన్పై దాడికి పాల్పడిన శ్రీనివాస్ది అమలాపురం సమీపంలోని ముమ్మిడివరం. ఎయిర్పోర్టు లాంజ్ క్యాంటీన్ యాజమాని హర్షవర్ధన్కు అతను సన్నిహతుడు, అంతేగాక అక్కడే పనిచేస్డున్నాడు శ్రీనివాస్. హర్షవర్థన్ అధికార టీడీపీ నాయకుడు కావడం గమనార్హం. అతను గతంలో గాజువాక టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ పెద్దల సిఫార్సుతోనే అతనికి ఎయిర్పోర్టు క్యాంటీన్ కాంట్రాక్ట్ వచ్చింది. అతని క్యాంటీన్లోనే పనిచేస్తున్న శ్రీనివాస్ భద్రత తనిఖీల కళ్లుగప్పి కత్తిని ఎలా లోపలికి తీసుకొచ్చాడు? అన్నది ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది.
మరి ఈ ఫొటోల సంగతేంటి?
సమగ్ర దర్యాప్తు జరిగితే తప్ప ఈ ఘటనకు వెనక ప్రేరేపణ ఏమిటి? కుట్ర ఏమిటి? అన్నది తెలియదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఎయిర్పోర్టు భద్రతపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎయిర్పోర్టు లోపలికి ఓ వ్యక్తి కత్తి ఎలా తీసుకెళ్లాడు? ఎయిర్పోర్టులోకి కత్తి తీసుకురావడానికి అతనికి సహకరించిందెవరు? తనిఖీ చేయకుండా భద్రతా సిబ్బంది అతన్ని లోపలికి ఎలా పంపించారు? అన్న కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్లతో కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న ఫొటులు కూడా ఇప్పుడు వైరల్గా మారాయి. జగన్ అభిమాని అని ఓ వైపు వాదనలు వినిపిస్తుండగా.. ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్న ఈ ఫొటోలను చూసిన వైసీపీ అభిమానులు ఇదేమంటారు? అని నిలదీస్తున్నారు.
జగన్తో ఫొటోలు దిగాడు కానీ... టీడీపీ కుటుంబమే..?
నిందితుడు శ్రీనివాస్.. గతంలో జగన్ను పలుమార్లు కలిశాడు. జగన్తో కలిసి అతడు ఫొటోలు కూడా దిగాడు. ఆ ఫొటోలను ఫ్లెక్సీలుగాను చేయించుకున్నాడు. మరి జగన్పై అంత అభిమానం ఉన్న వ్యక్తి ఆయనపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందనేది ఇప్పుడు తేలాల్సిన విషయం. కాగా, జగన్పై దాడికి పాల్పడిన నిందితుడి పూర్తి పేరు జనిపల్లి శ్రీనివాస రావు. ఇతడు నిరుపేద దళిత (మాల) కుటుంబానికి చెందిన యువకుడు. తండ్రి పేరు తాతా రావు. ఐదుగురు సంతానంలో శ్రీనివాస్ చివరివాడు. వీరిది వ్యవసాయ కుటుంబం. శ్రీనివాస్ది అమలాపురం సమీపంలోని ముమ్మిడివరం గ్రామం. కొన్నేళ్ల పాటు అతడు దుబాయ్లో పనిచేసి ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికి ముందు స్వగ్రామం వచ్చాడు. అనంతరం పరిచయం ఉన్నవాళ్లతో సంప్రదించి విశాఖ ఎయిర్పోర్టులోని క్యాంటీన్ పని సంపాదించాడు. తాను జగన్ అభిమాని అని చెప్పుకున్నప్పటికీ.. శ్రీనివాస్ కుటుంబసభ్యులు టీడీపీ అభిమానులనే వాదన వినిపిస్తోంది. కాదు, వారు వైసీపీ అభిమానులేనని మరికొందరి వాదనగా ఉంది.