చంద్రబాబు పిలిస్తే కలిశా: శ్రీనివాసన్, అదిరింది.. సీఎంపై అమెరికా మేయర్ ప్రశంస
గుంటూరు/విజయవాడ: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సెల్ (ఐసీసీ) చైర్మన్ శ్రీనివాసన్ బుధవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిశారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు.
ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు మేరకే తాను వచ్చానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.
వంశీకి చంద్రబాబు పరామర్శ
గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సీఎం చంద్రబాబు బుధవారం పరామర్శించారు. వంశీ తండ్రి రమేష్ చంద్ ఈ నెల 17న అనారోగ్యంతో మృతి చెందారు. వంశీని పరామర్శించేందుకు 11 గంటలకు హెలికాప్టర్లో ఉంగుటూరు వచ్చారు.
చంద్రబాబుకు కాలిఫోర్నియా ప్రీమోంట్ సిటీ మేయర్ ప్రశంస
రాజధాని అమరావతి శంకుస్థాపన వేడుకలను అట్టహాసంగా నిర్వహించిన ఏపీ ప్రభుత్వం పలువురి నుంచి ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా కాలిఫోర్నియాలోని ఫ్రీ మోంట్ సిటీ మేయర్ బిల్ హ్యారిసన్ చంద్రబాబును అభినందించారు.
శంకుస్థాపన వేడుకను ఘనంగా నిర్వహించారంటూ బాబుకు అభినందన పత్రాన్ని పంపారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి పల్లె రఘునాథ రెడ్డికి ప్రశంసా పత్రాన్ని అందించారు. రాజధాని ప్రాంత రైతులు కూడా రెండు రోజుల క్రితం చంద్రబాబును కలిసి అభినందించారు.