శ్రీనివాసన్తో జగన్ మంతనాలు, బ్యాక్గేట్ నుండి వెళ్లారు
హైదరాబాద్: బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి ఇండియా సిమెంట్స్ ఛార్జీషీటు అంశంలో నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరైన అనంతరం జగన్తో శ్రీనివాసన్ అరగంట పాటు భేటీ అయ్యారు.
అంతకుముందు కోర్టులో హాజరైన శ్రీనివాసన్ మీడియా కంట పడకుండా వెనుక ద్వారం నుండి బయటకు వెళ్లిపోయారు. ఆయనను జగన్ ఆహ్వానించారు. శ్రీనివాసన్, జగన్ల భేటీ చర్చనీయాంశమైంది.
కాగా, ఆస్తుల కేసులో శ్రీనివాసన్ శుక్రవారం సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే. జగన్ కేసులోని ఇండియా సిమెంట్స్ ఛార్జీషీటుపై శ్రీనివాసన్తో పాటు వైయస్ జగన్, విజయ సాయి రెడ్డి తదితరులు కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణను కోర్టు డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.
కోర్టుకు హాజరైన సందర్భంగా శ్రీనివాసన్ మాట్లాడారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని ఆయన చెప్పారు. తమ నిజాయితీని న్యాయస్థానంలో నిరూపించుకుంటామని చెప్పారు. సిబిఐ విచారణ జరుపుతోందని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని శ్రీనివాసన్ తెలిపారు.