ఫోరెన్సిక్ ల్యాబ్ కు శ్రీనివాసులు రెడ్డి సూసైడ్ నోట్స్ .. కడపలో రహస్యంగా సాగిన డీజీపీ సమీక్ష
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, తన బాబాయి మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసును సిట్ అధికారులు త్వరగా తేల్చాలని, అందుకు డెడ్ లైన్ కూడా పెట్టిన విషయంఅందరికీ తెలిసిందే . కీలకమైన సాక్ష్యాల కోసం కూపీ లాగుతున్న పోలీసులకు అనుకోని విధంగా వివేకా హత్య కేసులో అనుమానితుడైన శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్య షాక్ ఇచ్చింది. ఇక ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాసులు రెడ్డి కేవలం అనుమానితుడు మాత్రమే. అతనిపై కేసు కూడా నమోదు కాలేదు. అలాంటి సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం మిస్టరీ అనే చెప్పాలి.
కడపలో వివేకా కేసు, శ్రీనివాసులు రెడ్డి సూసైడ్ కేసులో పురోగతి సమీక్షించిన డీజీపీ
ఆత్మహత్యకు పాల్పడ్డ మే కాకుండా వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ, వైయస్ భాస్కర్ రెడ్డి కి ఒక లేఖ ఆయన రాసినట్లుగా చెబుతున్న లేఖలపై పోలీసులు దృష్టిపెట్టారు. లేఖను శ్రీనివాసులురెడ్డి రాశాడా? ఎవరైనా క్రియేట్ చేశారా? అన్నది నిర్ధారించేందుకు దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలని నిర్ణయించారు పోలీసులు. ఇక వివేకా హత్య కేసుతో లింకున్న ఈ ఆత్మ హత్య కేసును చాలా సీరియస్ గా తీసుకున్న డిజిపి గౌతమ్ సవాంగ్ కేసును స్వయంగా దర్యాప్తు చేస్తున్నారు. నిన్న కడపలో వివేకా హత్యకేసుతో పాటు ఈ కేసుపై విచారణ జరిపిన ఆయన ఈ కేసుకు సంబంధించి కూడా పలు అంశాలపై సమీక్షించారు. ఆయన ప్రత్యేక దర్యాప్తు బృందానికి అవసరమైన సూచనలు , సలహాలు ఇచ్చారు. డీజీపీ పర్యటన అంతా రహస్యంగా సాగడం, పోలీసులు దీనిపై నోరు మెదపక పోవడంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది .
శ్రీనివాసులు రెడ్డి సూసైడ్ పై అనుమానాలు .. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఈ కేసులో ప్రధానంగా అనుమానితులుగా భావిస్తున్న నలుగురిని కోర్టు అనుమతితో కొన్ని రోజుల క్రితం నార్కో అనాసిస్ పరీక్షల కోసం గుజరాత్ తీసుకువెళ్లారు. అక్కడ కీలక సమాచారం వెల్లడైనట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తానని, కేసు మిస్టరీని ఛేదిస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో తాజాగా శ్రీనివాసులురెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందడం మిస్టరీగా మారింది. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు శ్రీనివాసుల రెడ్డి అని కుటుంబ సభ్యులు, బంధువులు చెప్తున్న నేపథ్యంలో పోలీసులు ఇది ఇంకేమైనా కుట్రకోణమా అని దర్యాప్తు ప్రారంభించారు.
ఫోరెన్సిక్ ల్యాబ్ కు శ్రీనువాసుల రెడ్డి లేఖలు .. మరింత లోతుగా విచారణ
అయితే ఆయన స్వయంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా ? లేదా ఎవరైనా ప్రోద్బలంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారా? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు సాగుతోంది. ఇక ఆయన రాసిన లేఖలలో రెండు రకాల రాతలు ఉన్న కారణంగా పోలీసులు లేఖలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాత శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యకు సంబంధించిన మిస్టరీ తేలనుంది. ఇక దీంతో వివేకా హత్య కేసుకు ఏదైనా లింక్ ఉందా లేదా అన్న అంశం కూడా బయట పడే అవకాశముంది. ఏది ఏమైనా షాకింగ్ ట్విస్ట్ లతో ఇంత కాలం గడిచినా వివేకా హత్య కేసు ముడి వీడలేదు. అనూహ్య పరిణామాలతో మరింత చిక్కు ముడిగా ఈ కేసు తయారవుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు అయినా ఇంకా సిట్ అధికారులు వివేకా హత్యకేసుకు సంబంధించిన మిస్టరీ ఛేదించలేకపోయారు.