శ్రీశైలం డ్యాంకు పొంచివున్న ప్రమాదం: 100 మీటర్ల లోతు గుంతలు..నిపుణుల కమిటీ హెచ్చరిక
తెలుగు రాష్ట్రాలకు సాగునీరు, తాగునీరు అందిస్తున్న , విద్యుత్ వెలుగులు నింపుతున్న శ్రీశైలం డ్యామ్ ప్రమాదం లో ఉందా? మరమ్మతులు ఆలస్యం చేస్తున్న కొద్దీ పెను ప్రమాదం ముంచుకొస్తోందా అంటే అవుననే చెబుతున్నారు నిపుణులు. శ్రీశైలం డ్యామ్ కు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ప్లంజ్ పూల్ లో భారీగా గుంతలు .. మరమ్మత్తులు అవసరం
ఈ ఏడాది భారీ వర్షాలు ,వరదల కారణంగా కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే శ్రీశైలం డ్యాం వద్ద పలు దఫాలుగా గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. వస్తున్న వరదను క్రిందికి పంపించడానికి అధికారులు ఈ మధ్య కాలంలో తరచుగా గేట్లు ఎత్తుతున్నారు. అయితే ఈ క్రమంలోనే గేట్ల నుండి విడుదలైన నీటి ఉధృతికి నీరు కిందపడే ప్రాంతంలో ప్లంజ్ పూల్ లో భారీగా గుంతలు పడినట్లుగా అధికారులు గుర్తించారు. అంతేకాకుండా శ్రీశైలం డ్యాంకు దిగువన కుడి ,ఎడమ వైపు కూడా కాలువలకు భారీగా మరమ్మతు చేయాల్సిన అవసరం ఉందని నిపుణుల కమిటీ పేర్కొంది.
గతంలోనూ డ్యాం భద్రతపై హెచ్చరికలు
ప్లంజ్ పూల్ లో పడిన గుంతలు పెద్దవిగా మారి అవి డ్యాం వైపు విస్తరించే అవకాశం ఉన్నట్లుగా పేర్కొన్న నిపుణుల కమిటీ త్వరితగతిన మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
గతంలోనూ పలుమార్లు శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని లేకపోతే భారీ నష్టం తప్పదని ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ సైతం హెచ్చరించారు. తాజాగా నిపుణుల కమిటీ కూడా శ్రీశైలం డ్యామ్ కు తక్షణం మరమ్మతులకు పలు ముఖ్యమైన అంశాలను సూచించింది .
నిపుణుల కమిటీ చెప్పిన అంశాలు ... చేసిన సూచనలు ఇవే
ప్లంజ్ పూల్ లో 6,8 గేటు ఎదురుగా పెద్ద గుంతలు పడ్డాయని, ఆ గుంతలు వంద మీటర్లకు పైగా లోతు ఉన్నట్లుగా గుర్తించామని పేర్కొన్నారు. 2002 లో వేసిన కాంక్రీట్ కూడా పూర్తిగా నీటి ఉధృతికి కొట్టుకు పోయిందని దీనిని తీవ్రంగా పరిగణించి తక్షణం పట్టించుకోవాలని సూచించారు . దిగువన రెండువైపులా అప్రాన్ లు దెబ్బతిన్నాయని తెలిపారు. రివర్ స్లూయెజ్ లలో లీకేజీ ఉందని పరీక్షించి బాగు చేయాలని కూడా పేర్కొన్నారు. ప్రధాన స్పిల్ వే గేట్ల సీవేజ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. భారీ వరదలను మళ్లించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైన కూడా దృష్టి పెట్టాలని నిపుణుల కమిటీ పేర్కొంది.
Recommended Video
శ్రీశైలం డ్యామ్ మరమ్మతులకు సుమారు 900 కోట్ల రూపాయలు ఖర్చు
శ్రీశైలం డ్యామ్ మరమ్మతులకు సుమారు 900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా నిపుణుల కమిటీ అంచనా వేసింది. శ్రీశైలం డాం తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాల అవసరాలకు సంబంధించింది కాబట్టి మరమ్మతులకు అయ్యే ఖర్చును రెండు భరించాలని, కేంద్రం కూడా తగిన సాయం అందించాలని ఇటీవల కేంద్ర జల శక్తి మంత్రి రాసిన లేఖలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరారు.
ఇప్పటికే డ్యాం కు పెను ప్రమాదం పొంచి ఉందని పలుమార్లు హెచ్చరికలు నిపుణులు జారీ చేసిన నేపధ్యంలో త్వరితగతిన మరమ్మత్తులు చెయ్యకుంటే కష్టం అంటున్నారు నిపుణులు .