శ్రీశైలం ప్రాజెక్టుకు పండుగ కళ.. ఇరు రాష్ట్రాల మంత్రుల పూజలు.. 4 గేట్లు ఎత్తి..! (వీడియో)
శ్రీశైలం : ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. శుక్రవారం సాయంత్రం నాటికి శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దాంతో నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడంతో చూసేందుకు సందర్శకులు క్యూ కడుతున్నారు. ఈ సీజన్లో గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి కావడంతో అక్కడ పండుగ వాతావరణం కనిపించింది. తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.
టీఆర్ఎస్ లీడరా, మజాకా.. మొక్కుబడిగా మొక్క నాటిండ్రు.. కేసీఆర్కే వక్ర భాష్యం..! (వీడియో)
కృష్ణమ్మకు ప్రత్యేక పూజల తరువాత ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ క్రమంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ కిందకు కదిలింది. నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతూ కనువిందు చేసింది. ఈ అద్భుత ఘట్టం వీక్షించి సందర్శకులు తన్మయత్వం చెందారు. అయితే నాలుగు గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.
నాలుగు గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కులు కిందకు విడుదల చేయగా.. ఒక్కో గేటు నుంచి 25 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. మొదట 6వ నెంబర్ గేటు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. అనంతరం వరుసగా 7,8,9 గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని కిందకు వదిలారు. శ్రీశైలం జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం అది 880 అడుగులకు చేరుకుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి కాస్తా ముందుగానే జలాశయం నిండిందని అధికారులు తెలిపారు. అదలావుంటే ఈ ప్రాజెక్టు సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 189.89 టీఎంసీల నీరు నిల్వ అయింది. ఆ నేపథ్యంలోనే నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు అధికారులు.