రాజధాని, తెలుగు తల్లి అద్భుతం, ఉడత సాయమే: బాబుకు రాజమౌళి థ్యాంక్స్(వీడియోలు)
Recommended Video
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం అమరావతిలో పలు భవంతుల నమూనాలపై రాజమౌళి తన అభిప్రాయాలను ఏపీ ప్రభుత్వానికి వెల్లడించిన విషయం తెలిసిందే.సృష్టికర్త! ఘనతంతా
చంద్రబాబుదే: కేటీఆర్ షాకింగ్ కామెంట్స్, అమరావతిపైనా..
కాగా, గురువారం ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో చంద్రబాబునాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. తాను ఇచ్చిన ఓ ఐడియాకు చంద్రబాబు ఓకే చెప్పారని పేర్కొంటూ ఓ వీడియోను పోస్టు చేశారు.
అద్భుతంగా తెలుగుతల్లి
తనకు అవకాశం ఇచ్చిన ఆయనకు కృతజ్ఞతలు పేర్కొంటూ, కొత్త అవకాశాలను వెతికే క్రమంలో ఎన్నో ఆలోచనలు వస్తున్నాయని అన్నారు. అసెంబ్లీ భవనంలో తెలుగుతల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్న తన ఆలోచనకు చంద్రబాబు అంగీకారం తెలిపారని పేర్కొంటూ ఓ గ్రాఫిక్ వీడియోను పోస్టు చేశారు రాజమౌళి.
రామసేతువు నిర్మాణంలో ఉడత లాంటి పాత్రే
అమరావతి ఆకృతుల రూపకల్పనలో పాలుపంచుకోవడం మీకెలా అనిపిస్తోందన్న మీడియా ప్రశ్నకు సినీదర్శకుడు రాజమౌళి స్పందిస్తూ...‘రామసేతువు నిర్మాణంలో వందలసంఖ్యలో వానరసైన్యం పాల్గొన్నా... వారందరి పేర్లూ ఎవరికీ తెలియవు. ఉడత పేరే అందరికీ తెలుస్తుంది. నా పరిస్థితి కూడా అదే...' అని పేర్కొన్నారు. అమరావతిపై తాను షార్ట్ ఫిల్మ్ ఏదీ రూపొందించడం లేదని స్పష్టం చేశారు.
తెలుగువారికి గర్వకారణం
‘రాజధాని ఆకృతులకు నేను మూడుదశల్లో సలహాలు, సూచనలు అందజేశాను. తెలుగువారికి గర్వకారణంగా, నిరుపమానంగా, దిగ్గజ భవనంలా, భారతీయత ఉట్టిపడేలా, సంస్కృతి ప్రతిబింబించేలా ఉండాలని సీఎం చెప్పడంతో నేను ఒక అధికారిక డాక్యుమెంట్ తయారుచేశాను. నాకు అందించిన చిత్రాల్లో తెలుగువారికి ఇంత గర్వపడే గొప్ప చరిత్ర ఉందా? అని సందర్శకులు ఆశ్చర్యపడేలా కొన్నింటిని ఎంపిక చేశాం. శాసనసభకు టవర్ ఆకృతిని ఎంపిక చేస్తే, ఈ చిత్రాలను మీడియా లేదా కల్చరల్ సిటీల్లో నిర్మించే భవనాలకు వినియోగిస్తారని అనుకుంటున్నాను. టవర్ ఆకృతికి నేను ఇచ్చిన సలహాలేమీ లేవు.' అని రాజమౌళి వివరించారు.
ఖరారైన భవనాలు
రాజధాని అమరావతిలో నిర్మించే శాసనసభ భవనం ఆకృతి దాదాపు ఖరారైంది. భవనంపై సూది మొనలాంటి (సైక్) పొడవైన టవర్తో సిద్ధం చేసిన ఆకృతి ఎక్కువ మందిని ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థ చతురస్రాకారంలో, భవనంపై ఎత్తైన టవర్తో రూపొందించిన రెండు ఆకృతుల్ని మరింత మెరుగుపరిచి తీసుకువచ్చింది. వీటిపై సుదీర్ఘంగా చర్చించారు. రెండు ఆకృతుల వీడియో చిత్రాలను సీఆర్డీఏ వెబ్సైట్లోను, సామాజిక మాధ్యమాల్లోను ఉంచి ప్రజాభిప్రాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. గురువారం సంస్థ ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. ప్రజాభిప్రాయాన్ని బట్టి తుదినిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఎక్కువ మంది నుంచి స్పందన రాకపోతే, శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ మీడియాకు తెలిపారు. హైకోర్టు, శాసనసభ భవనాలను 2019 మార్చి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.
ఐకానిక్ భవనాలే..
శాసనసభ భవనానికి సంబంధించి చతురస్రాకార భవనాన్ని తెలుగువారి ఘనచరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని కలబోస్తూ...టవర్ ఆకృతిని నవ్యతకు అద్దంపట్టేలా రూపొందించారు. సూది మొన ఆకృతిలో రూపొందించిన భవనం ఎత్తు టవర్తో కలిపి 250 మీటర్లు ఉంటుంది. వెడల్పు కూడా అంతే. చుట్టూ ఉన్న తటాకంలో దీని ప్రతిబింబం కనపడుతుంది. ఈ టవర్లో 70 మీటర్ల ఎత్తు వరకు (70 అంతస్తులు) సందర్శకులు వెళ్లవచ్చు. అక్కడొక వ్యూయింగ్ ప్లేస్ ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు.
తెలుగు తల్లి ప్రత్యేకమే..
చతురస్రాకారపు భవనం కుఢ్యాలపై దర్శకుడు రాజమౌళి అందజేసిన త్రీ డైమెన్షన్ చిత్రాలు పెద్ద పరిమాణంలో కనిపించేలా తీర్చిదిద్దారు. నాలుగు పక్కల నుంచి చూస్తే ఉదయిస్తున్న సూర్యుడు, పురివిప్పిన నెమలి, బౌద్ధచక్రం... నాట్యం, సంగీతం, మూలల నుంచి చూస్తే ఏనుగు, లేపాక్షి బసవన్న, మన శిల్పసంపదను ప్రతిబింబించే చిత్రాలు కనపడతాయి. శాసనసభ భవనం సెంట్రల్హాల్లో రాజమౌళి సూచన మేరకు తెలుగుతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. సూర్యకిరణాల వెలుగులో ఆ విగ్రహం మెరిసిపోయేలా తీర్చిదిద్దుతారు .