ఎన్టీఆర్, విజయ్ దేవరకొండకు లోకేష్ కృతజ్ఞతలు: తమ వంతుగా అంటూ బ్రాహ్మణి
Recommended Video
విజయవాడ/శ్రీకాకుళం: తుఫాను బాధితులకు సహాయం అందిస్తున్న దాతలకు ఏపీ మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. సినీ నటులు ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ పెద్ద మొత్తంలో తుఫాను బాధితులకు విరాళాలు ప్రకటించి ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టారని అభినందించారు.
టిట్లీ బీభత్సం: బాధితుల ఆవేదన ఎవరికీ పట్టదా?, కంటతడి పెడుతున్న శ్రీకాకుళం
ఎన్టీఆర్, కళ్యాణ్రామ్.. లకు లోకేష్ ధన్యవాదాలు
ఎన్టీఆర్, కళ్యాణ్రామ్లకు ట్విట్టర్లో మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. వీరితో పాటు తుఫాను సహాయాన్ని ప్రకటించిన సినీనటులు విజయ్ దేవర కొండ, నిఖిల్, సంపూర్ణేష్ బాబు, అనిల్ రావిపూడి, కోన వెంకట్ తదితరులతో పాటు ఇతర సినీ రంగ ప్రముఖులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. తుఫాను బాధితులను ఆదుకునేందుకు అన్నివర్గాల వారు ముందుకు రావాలని కోరారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో లోకేష్
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ మందస సబ్ స్టేషన్ని పరిశీలించారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తుఫాను ధాటికి 5 వేల ఇళ్లు దెబ్బతిన్నాయని అంచనా వేశామని, తండాలో ఎక్కువ ఇళ్లు పడిపోయాయని తెలిపారు. రేపు సాయంత్రానికి నష్టపరిహారం అంచనా పూర్తి అవుతుందని మంత్రి పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటలలోపు పనులు పూర్తి చేసి నిరంతర విద్యుత్ ఇవ్వాలని, అన్ని గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరణపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు.
సహాయక చర్యలు ముమ్మరం కావాలి..
అనంతరం మందస డీఆర్డీఏ వెలుగు కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా, హౌసింగ్ శాఖ అధికారులతో లోకేష్ సమావేశమయ్యారు. 244 నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిరంతరంగా కొనసాగాలన్నారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా ప్రతీ గ్రామానికి నీరు అందించాలని తెలిపారు. బుధవారం సాయంత్రానికి నష్టపరిహారం అంచనా పూర్తి చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. తాను అమెరికాకు ఓ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ తన పర్యటనను రద్దు చేసుకుని శ్రీకాకుళం సహాయక చర్యల్లో పాల్గొంటున్నానని నారా లోకేష్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.
తమవంతుగా అంటూ నారా బ్రాహ్మణి
మరోవైపు తుఫాను సహాయక చర్యల్లో భాగంగా హెరిటేజ్ బృందం ముమ్మరంగా సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ నారా బ్రహ్మణి తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 11లక్షల నీటి ప్యాకెట్లను ఉచితంగా సరఫరా చేశామని ట్విట్టర్లో పేర్కొన్నారు. మరో 5లక్షల ప్యాకెట్లను సరఫరా చేయటంతో పాటు మొబైల్ వాహనాల ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణి తెలిపారు.