ఏపిలో ప్రక్షాళన ప్రారంభం..! మొదటి వేటు తెల్లరేషన్ కార్డులపైనే..!!
అమరావతి/ హైదరాబాద్ : ఏపిలో అక్రమ తెల్ల రేషన్ కార్టు దారుల ఏరివేత ప్రక్రియ మొదలైంది. అనర్హుల ఏరివేతలో భాగంగా తొలుత ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతూ తెల్లకార్డులు పొందిన వారిపై దృష్టి సారించారు. అనర్హులకు జారీ అయినవిగా గుర్తించి, వీటిని కనీస సమాచరం లేకుండా తొలగించారు అదికారులు. అంటే, కార్డు ఉంటుంది కానీ, సరుకులు తీసుకోవడం సాధ్యం కాదు. సీఎఎంఎస్ (సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ) ద్వారా వేతనాలు పొందుతున్న వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ, తొలిదశలో ఈ జాబితాలో ఉన్న వారి తెల్లకార్డులను నిరర్దకంగా మార్చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.39 లక్షల తెల్లరేషన్ కార్డులు పనిచేయడం మానేశాయి. ఇలా అర్హత లేకుండా తెల్లకార్డులు కలిగిన వారు ఇంకా ఎవరైనా ఉంటే దశల వారీగా రద్దు చేస్తామని అదికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Recommended Video
ప్రభుత్వ ఉద్యోగులకూ తెల్ల కార్డు..! సీఎఫ్ ఎంఎస్ ఆధారంగా ప్రక్షాళన..!!
ఇదిలా ఉండగా ఈ-పోస్ (బయోమెట్రిక్ ద్వారా రేషన్పంపిణీ) విధానం వచ్చాక నకిలీ కార్డులు పూర్తిగా తొలగిపోయాయి. కానీ, అర్హత లేనివారు చాలా మంది తెల్లకార్డులు కలిగిఉన్నారనే అనుమానాలు ఉన్నాయి. మొత్తం రేషన్కార్డుల వ్యవస్థను ప్రక్షాళన చేయాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత ప్రభుత్వ ఉద్యోగులపై దృష్టిపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగి పేరులో లేకపోయినా వారి కుటుంబంలో ఎవరి పేరుతోనైనా కార్డుకలిగి ఉంటే వాటిపైనా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఇప్పటిదాకా లక్షకు పైగా కార్డులు తొలగించారు. ఇకపై అర్హత లేని కుటుంబాలకు కార్డులపై డ్రైవ్ చేపట్టనున్నారు.
1.39 లక్షల కార్డుల ఏరివేత..! అన్నీ అర్హత లేనివిగా గుర్తింపు..!!
ఒక్కో జిల్లాలో దాదాపుగా పదివేల కార్డులు తాజా చర్యలతో తొలగించనున్నట్లు తెలిసింది. గతేడాది దరఖాస్తు చేసుకోకపోయినా 52వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు కార్డులు జారీచేసి ప్రభుత్వం తప్పులో కాలేసింది. 'అర్హులైతే అడగకపోయినా కార్డులు ఇద్దాం' అనే ప్రజానుకూల నినాదంతో ప్రజాసాధికార సర్వే ఆధారంగా దరఖాస్తు చేసుకోనివారికి కూడా కార్డులు జారీచేసింది. ఇందులో అనేక మంది అర్హులు ఉన్నారు.
త్వరలో వాటిని తొలగించే అవకాశం..! అక్టోబరు 2 నాటికి ప్రక్రియ పూర్తి..!!
దాదాపు 60వేల మంది వరకు అనర్హులకూ అప్పట్లో కార్డులు జారీచేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కొందరు న్యాయమూర్తులు, కేంద్రప్రభుత్వ ఉద్యోగులు వీరిలోఉన్నారు. అడగకపోయినా కార్డులు ఇవ్వడంపై అప్పట్లో వారిలో చాలామంది అసంతృప్తి వ్యక్తంచేశారు. తప్పును గుర్తించిన ప్రభుత్వం వెంటనే వారికి కొత్తగా జారీచేసిన కార్డులను రద్దుచేసింది. ఇప్పుడు తొలగించనున్న కార్డులు చాలాకాలం నుంచి ఉన్నట్లు తెలుస్తోంది. దరఖాస్తు చేసుకున్నవారందరికీ కార్డులు జారీచేసి సరిగా పరిశీలన చేయలేదంటున్నారు. ఇలాంటి కార్డులను గుర్తించి, ప్రక్షాళన చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది.
అక్టోబర్ నుంచే కొత్త పాలసీ అమలు..! అక్రమాలపై కొరఢా ఝలిపిస్తున్న సర్కార్..!!
అక్టోబరు 2న గ్రామ సచివాలయాలు ప్రారంభం అయ్యేనాటికి ఏరివేతను పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అదే రోజు నుంచి కొత్త కార్డుల జారీకి సరికొత్త విధానం తీసుకొస్తారు. ఎవరైనా కార్డు కావాలని గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే కేవలం 72 గంటల్లోనే దాన్ని పరిశీలించి ఈ విధానంలో కార్డు జారీచేస్తారు. ఈ లోగా కార్డుల వడపోతను పూర్తిచేయనున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో ఒక కోటి 47లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి. ప్రజాసాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో 1.45కోట్ల కుటుంబాలు ఉంటే అంతకంటే ఎక్కువ రేషన్ కార్డులు ఉండటం గమనార్హం.