అమరావతి విషయంలో తేడా వస్తే 28న రాష్ట్ర బంద్.. రాజధాని తుది నిర్ణయంపై టెన్షన్..: టీడీపీ
ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానుల ప్రకటనపై వెల్లువెత్తుతున్న నిరసనలు నేటితో పదో రోజుకు చేరాయి. రాజధాని రైతుల పోరాటం ఇప్పటికే ఉధృతంగా సాగుతున్న తరుణంలో నేడు జరగనున్న అత్యంత కీలకమైన క్యాబినెట్ భేటీ రాజకీయంగా అందరిలోనూ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే టీడీపీ మాత్రం మొదటి నుండి రాజధాని అమరావతినే అని తేల్చి చెప్తుంది. రాజధాని రైతుల ఆందోళనలకు మద్దతు పలుకుతూ రాజధాని ప్రాంత ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది.
28వ తేదీన ఆంధ్రప్రదేశ్ బంద్
ఇక నేడు క్యాబినెట్ భేటీ జరగనున్న క్రమంలో ఒకవేళ రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్ ప్రతికూల నిర్ణయం తీసుకుంటే ఈనెల 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ బంద్ ను నిర్వహించనున్నట్లు టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ నెల 27వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశంలో రాజధాని అమరావతికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే తాము బంద్ నిర్వహిస్తామని ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు.
విశాఖను ఆర్ధిక రాజధానిగా చెయ్యాలన్న ప్రత్తిపాటి పుల్లారావు
ఏపీలో ఐదు కోట్ల మంది మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారన్నారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చెయ్యాలని కోరుతున్నారని అన్నారు. అమరావతిలో అన్ని ఉంచి, విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. జగన్ ఏడు నెలల పాలనలో పూర్తిగా ఏపీ వెనకబడి పోయిందన్నారు ప్రత్తిపాటి పుల్లా రావు. .ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రకటించడంతో నాటి నుండి నేటి వరకు టీడీపీ వరుస పోరాటాలు సాగిస్తూనే ఉంది.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ప్రకటనతో మొదలైన రాజకీయ వేడి నేడు క్యాబినెట్ భేటీతో పీక్స్ కు చేరుకుంది . ఇదిలావుండగా, ఏపీ రాజధాని మార్పుపై నిర్ణయాన్ని పునః పరిశీలించాలని తెలుగు దేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ప్రతిపతి పుల్లా రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంత రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన ఆయన అమరావతిపై ప్రభుత్వం పునపరిశీలించడంలో విఫలమైతే రేపు రాష్ట్ర బంద్ కోసం పిలుపునిస్తామని చెప్పారు.