రామతీర్ధం వెళ్లనీయకపోతే రాష్ట్రం తగలబడుతుంది- కేంద్రానికీ ఫిర్యాదు బీజేపీ నేత విష్ణు
ఏపీలోని విజయనగరం జిల్లా రామతీర్ధం ఆలయంలో రాముడి విగ్రహం తల నరికిన ఘటన నేపథ్యంలో ఆలయ సందర్శన కోసం ఇవాళ బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే రామతీర్ధం ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉండటంతో ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టడం కుదరదని పోలీసులు స్ఫష్టం చేశారు. ఈ నేపథ్యంలో రామతీర్ధానికి బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు.
బీజేపీ నేతలను రామతీర్ధం వెళ్లకుండా అడ్డుకోవడంపై ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీజేపీ నేతలను రామతీర్ధం వెళ్లనీయకపోతే రాష్ట్రం తగులబడిపోతుందని వైసీపీ ప్రభుత్వాన్ని విష్ణు హెచ్చరించారు. జరగబోయే పరిణామాలకు సీఎం జగన్ నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రామతీర్ధం కొండపైకి టీడీపీ, వైసీపీని అనుమతించి మమ్మల్ని అడ్డుకోవడం ఏంటని ఆయన పోలీసులను ప్రశ్నించారు. వైసీపీ కండువాలు కప్పుకుని డ్యూటీ చేయాలని పోలీసులను విష్ణు సూచించారు.
రామతీర్ధానికి వెళ్లకుండా బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసుల తీరుపై విష్ణువర్ధన్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులకు జీతాలు ఇస్తోంది వైసీపీ ఆఫీసా లేక రాష్ట్ర ప్రభుత్వమా అని విష్ణు ప్రశ్నించారు. ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని విష్ణు హెచ్చరికలు చేశారు. 60 ఏళ్ల వయస్సున్న సోము వీర్రాజును అరెస్టు చేయడం జగన్ పిరికిపంద చర్య అని విష్ణు విమర్శించారు. ఏపీలో ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం వల్లనే వరుస సంఘటనలు జరుగుతున్నాయని, దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని విష్ణు తెలిపారు.