ఒకే దశలో జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికలు... స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
అమరావతి: ఏపీలో స్థానిక సమరంకు రంగం సిద్ధమైంది. మూడు దఫాలుగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ కుమార్ తెలిపారు. ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామనిఎన్నికల కమిషనర్ తెలిపారు. రెండు దశల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. ఇక ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వస్తుందని ఆయన చెప్పారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించడం జరిగిందన్నారు. అదే సమయంలో ఖర్చుల విషయంలో కూడా ప్రత్యేక పరిశీలకులను నియమించినట్లు చెప్పారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని రాజకీయపార్టీలు సహకరించాలని నిన్న వారితో సమావేశమైనప్పుడు చెప్పామని ఎన్నికల అధికారి వెల్లడించారు.ఒకే విడతలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని చెప్పిన అధికారి... ఈనెల 21న ఈ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఈ నెల 24న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయని చెప్పారు. ఈనెల 23న మున్సిపల్ ఎన్నికలు 27న కౌంటింగ్ జరుగుతుందని ఎన్నికల కమిషనర్ చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు తొలి విడత పోలింగ్ మార్చి 27వ తేదీ జరగనుండగా 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు అదే రోజున ఫలితాలు వెలువడనున్నాయి. 660 జెడ్పీటీసీ , 9639 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు.
ఇక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని వెల్లడించారు ఎన్నికల కమిషనర్. అవసరమైతే గ్రామ సచివాలయాల ద్వారా ఎంపికైన సిబ్బందిని కూడా వినియోగించుకుంటామని వెల్లడించారు. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక పదవ తరగతి పరీక్షలు వాయిదా విషయం తామేమీ అడగలేదని చెప్పిన ఎన్నికల కమిషనర్... చీఫ్ సెక్రటరీ నీలం సహాని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు చెప్పాకే షెడ్యూల్ పై నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Recommended Video
ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పిన ఎన్నికల కమిషనర్... ఓటర్లని ప్రభావితం చేసే ఏ ప్రభుత్వ స్కీమ్స్ అయినా అమలు నిలుపుదల చేయాలన్నారు. బదిలీలు నియామకాలపై నిషేధం విధిస్తున్నామని చెప్పిన రమేష్ కుమార్... ఈ రోజు 11 గంటల్లోపు జరిగిన అన్ని బదిలీలు యథాతథంగా ఉంటాయని చెప్పారు. ప్రభుత్వ భవనాలపై ఉన్న రంగుల గురించి ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తున్నందున దానిపై ప్రత్యేక చర్యలు అంటూ ఏమీ తీసుకోబోమని చెప్పారు. కార్యాలయాలకు రంగులు ఉండటం వల్ల పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదని తాము భావిస్తున్నట్లు చెప్పారు ఎన్నికల అధికారి.