పరోక్షంగా.. జగన్ సర్కార్కు షాకిచ్చేలా? ఎన్నికల అధికారులను టార్గెట్ చేస్తున్నారని.. ఈసీ కీలక వ్యాఖ్యలు...
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి,రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు మధ్య పెద్ద యుద్దమే నడుస్తోన్న సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ పదవీ కాలం పూర్తయ్యేంతవరకూ ఎన్నికలు జరపవద్దన్న పంతంతో ప్రభుత్వం... ఎన్నికలు నిర్వహించే పదవి నుంచి దిగిపోవాలన్న పట్టుదలతో నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. ఈ పోరుపై కోర్టుల్లో విచారణ జరుగుతున్న దశలోనే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
చర్యలకు మా అనుమతి తప్పనిసరి : ఈసీ
దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడటమే తమ కర్తవ్యమని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. ఏ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకోవాలంటే తమ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి అని వెల్లడించింది. చర్యల పేరిట ఎన్నికల కమిషన్ అధికారులకు వాహనాలు, భద్రత, ఇతర సౌకర్యాలను కుదించే ప్రయత్నం చేయరాదని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు స్పష్టమైన సూచనలు చేసింది.
ఎన్నికల అధికారులకు వేధింపులు...
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత ఎన్నికల అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయని ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు (సీఈఓ)లను సైతం టార్గెట్ చేస్తున్న సంఘటనలను గమనించామని తెలిపింది. రాజకీయ ప్రతీకారాలకు వారిని బలి చేస్తున్న ధోరణులు ప్రబలుతున్నాయని పేర్కొంది. అంతేకాదు,వారి పదవీకాలం ముగియకముందే సాగనంపుతున్న చర్యలు కనిపిస్తున్నాయని పేర్కొంది.
భయానక వాతావరణం...
ఇలాంటి వేధింపులు ఓ భయానక వాతావరణాన్ని సృష్టిస్తాయని, ఎన్నికల అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంది. అంతేకాదు,నిజాయితీగా పనిచేసే అధికారులపై దీని ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలతో నిజాయితీగా పనిచేసే అధికారులు కుంగిపోవడమే కాదు,వారి కర్తవ్య దీక్షకు ఇవి ఆటంకంగా మారుతాయని పేర్కొంది. తద్వారా స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరపడంలో వారు విఫలం చెందవచ్చునని తెలిపింది. వేధింపులు,భయానక పరిస్థితుల్లో పనిచేసేందుకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు ఎలా ముందుకొస్తారని ప్రశ్నించింది.
ఏపీలో పరిస్థితులకు అద్దం పట్టేలా...
రాజకీయ ప్రతీకారాలకు ఎన్నికల అధికారులను బలి చేయవద్దని,పదవీ కాలం ముగియకముందే వారిని సాగనంపుతున్నారని కేంద్ర ఎన్నికల సంఘం చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి నిమ్మగడ్డకు మధ్య జరుగుతున్న పోరుకు అద్దం పట్టేలా ఉన్నాయి. గతేడాది ప్రభుత్వంతో కనీస సంప్రదింపులు లేకుండానే నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేశాక... రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా జీవో తీసుకొచ్చి నిమ్మగడ్డ స్థానంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి కనగరాజును నియమించిన సంగతి తెలిసిందే. చివరకు కోర్టు నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పునివ్వడంతో తిరిగి ఆయనే బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో దాదాపు నాలుగైదు నెలల పాటు నిమ్మగడ్డ సర్వీసు కోల్పోయారు. ఈ ఏడాది మార్చిలో నిమ్మగడ్డ రిటైర్మెంట్ కానుండగా... గతేడాది నాలుగైదు నెలల పాటు కోల్పోయిన సర్వీసును కూడా తిరిగి ఇవ్వాలని ఆయన కోరే అవకాశం లేకపోలేదు. పైగా ఎన్నికల కమిషనర్పై చర్యలు తీసుకునేముందు తమ అనుమతి తప్పనిసరి అని కేంద్ర ఎన్నికల సంఘం చేసిన తాజా వ్యాఖ్యలు పరోక్షంగా పరోక్షంగా ఏపీలో పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మున్ముందు ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డగా సాగుతున్న వివాదంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏమైనా జోక్యం చేసుకుంటుందా అన్న చర్చకు ఈ వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి.