ఏపీ డీజీపీ పేరు మీద జీవో: ఫస్ట్ టైమ్: ముఖ్య కార్యదర్శులకు బదులుగా: జీఏడీలో కీలకంగా
అమరావతి: సాధారణంగా ప్రభుత్వం విడుదల చేసే అన్ని జీవోలు ఆయా శాఖాధిపతుల పేర్ల మీద విడుదలవుతుంటాయి. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శి స్థాయి అధికారులు ఈ జీవోలను విడుదల చేస్తుంటారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను జీవోల ద్వారా అమలు చేస్తుంటారు. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు (బీఆర్ఓ) సహా ప్రభుత్వపరంగా తీసుకునే అన్ని రకాల చర్యలను కూడా ఆ శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శుల నుంచి జీవోలు వెలువడుతుంటాయి.
కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం: ఎగిసి పడిన మంటలు: ఉలిక్కిపడ్డ నెల్లూరు జిల్లా
ఈ సారి దీనికి భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ పేరు మీద జీవో విడుదలైంది. రాష్ట్రంలో అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)కి సంబంధించిన ఓ జీవో.. పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ పేరు మీద విడుదల కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎస్ఈబీని ముఖ్యమంత్రి పర్యవేక్షణలో కొనసాగే సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) కిందికి బదలాయిస్తూ జారీ చేసిన జీఓ ఇది.
రాష్ట్రంలో మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం చర్యలను తీసుకుంటోన్న నేపథ్యంలో.. ఎస్ఈబీ ఏర్పాటైన విషయం తెలిసిందే. పొరుగు రాష్ట్రాల నుంచి తరలిస్తోన్న అక్రమ మద్యం రవాణాను అరికట్టడం, వాటిని తరలించే వారిపై కఠిన చర్యలను తీసుకోవడానికి ఈ బ్యూరో ఏర్పాటైంది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల నుంచి పెద్ద ఎత్తున సరిహద్దులను దాటుకుంటోన్న అక్రమ మద్యాన్ని ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. కొద్దిరోజుల కిందటే 72 లక్షల విలువైన మద్యం బాటిళ్లను మచిలీపట్నంలో జేసీబీలో ధ్వంసం చేశారు.
Recommended Video
అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుంటోన్న సందర్భంగా పట్టుబడే నగదు మొత్తం, వాహనాలు.. ఇతరత్రా ఆర్థిక పరమైన కార్యకలాపాలను నిర్వహించడానికి ఈ విభాగాన్ని సాధారణ పరిపాలన కిందికి తీసుకొచ్చారు. ఆర్థిక కార్యకలాపాలు ఏపీ ఫైనాన్షియల్ కోడ్, ఏపీ ట్రెజరీ కోడ్ కింద నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన జీవోను గౌతమ్ సవాంగ్ విడుదల చేశారు. రాష్ట్ర డీజీపీతో పాటు హోమ్ శాఖ ఎక్స్ అఫీషియో ముఖ్య కార్యదర్శి హోదాలో ఆయన ఈ జీవోను జారీ చేశారు.