సిబిఐకి నో చెప్పే అధికారం రాష్ట్రానికి ఉందంటున్న ఆ న్యాయవాది;కేంద్రానికి భయపడేదే లేదు:చినరాజప్ప
విజయవాడ:ఆంధ్రప్రదేశ్ లో సిబిఐ విచారణకు అనుమాతి నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న నేపథ్యంలో ఎపి ప్రభుత్వం నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. వివిధ వర్గాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే సిబిఐ విచారణకు నో చెప్పే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని...రాష్ట్రంలో సిబిఐ జోక్యానికి నో చెప్పాలని కోరుతూ ఎపి సిఎస్ కు వినతిపత్రం ఇచ్చిన న్యాయవాది ఎర్నేని వేదవ్యాస్ వాదిస్తున్నారు. ఎపి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునేందుకు కారణమైన ఎర్నేని వేదవ్యాస్ విజయవాడలో ఒక తెలుగు న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే...
ఆ అధికారం..రాష్ట్రానికి ఉంది
కారణాలు ఏమైనప్పటికీ సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీస్ చట్టం సెక్షన్ 6 ప్రకారం అనుమతి నిరాకరించే అధికారం ఉందని ప్రముఖ న్యాయవాది ఎర్నేని వేదవ్యాస్ చెప్పారు. ఈ అధికారాన్ని కోర్టులు కూడా కాదనజాలవని...అలాంటి పరిస్థితి ఏమైనా వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తాను ఒక భారతదేశ పౌరుడిగా, విజయవాడ న్యాయవాదిగా సీఎస్కు వినతి పత్రం ఇచ్చానని ఎర్నేని వేదవ్యాస్ స్పష్టం చేశారు.
అందుకే..అలా వినతి
దేశంలో ఎన్నడూ లేని విధంగా సీబీఐ ప్రతిష్ట దారుణంగా దెబ్బతిందని...సీబీఐ ఆఫీసులో సీబీఐ అధికారులే దాడులు చేసే పరిస్థితి ఇప్పుడు ఉందని ఎర్నేని వేదవ్యాస్ ఎద్దేవా చేశారు. సిబిఐకి సంబంధించి దేశంలో ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఎన్నడూ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఐటీ, ఈడీ సంస్థలను తన చేతి సంస్థలాగా రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగిస్తోందని...అందుకే తాను సిఎస్ కు అలా వినతిపత్రం ఇచ్చానని వేదవ్యాస్ వెల్లడించారు.
సిబిఐ కంటే...ఎసిబి సూపర్
ప్రస్తుతం సీబీఐ కంటే ఏపీ ఏసీబీకే మంచి పేరు ఉందని...అవినీతి నిరోధక కేసుల్లో, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఏసీబీ బ్రహ్మాండంగా పనిచేస్తోందని ఎర్నేని వేదవ్యాస్ ఎసిబికి కితాబునిచ్చారు. ఏపీ ఏసీబీ పనితీరును సీబీఐ, ఐటీ కూడా ప్రశంసించాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా వివిధ సందర్భాల్లో ఏసీబీ నుంచి ఐటీ అధికారులు వివరాలు తీసుకుందన్నారు. అలాగే సాంకేతిక నైపుణ్యం విషయంలోనూ ఏసీబీ పనితీరు అద్బుతంగా ఉందన్నారు. వీటన్నింటిని బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై దర్యాప్తు చేసే సామర్ధ్యం ఏసీబీకి ఉందని ఎర్నేని వేదవ్యాస్ చెప్పుకొచ్చారు.
కేంద్రానికి భయపడం...చినరాజప్ప
ఇదిలావుంటే సీబీఐ విచారణకు గతంలో ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకున్న విషయం వాస్తవమేనని హోంమంత్రి చినరాజప్ప నిర్థారించారు. శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.సీబీఐపై ఆరోపణల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. దీంతో ఇకపై సీబీఐ విచారణ జరపాలంటే ప్రతీ కేసులోనూ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని చినరాజప్ప స్పష్టంచేశారు. ఈ నిర్ణయం ఎపి కొత్తగా తీసుకున్నది కాదని...కర్ణాటక లాంటి రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నాయని చినరాజప్ప వెల్లడించారు. అయితే ఏదేమైనా కేంద్రానికి భయపడే ప్రసక్తే లేదని చినరాజప్ప తేల్చేశారు.