అమరావతి బాండ్ల విషయంలో...అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా:కుటుంబరావు
అమరావతి:అమరావతి బాండ్ల విషయంలో ఏదైనా అవినీతి జరిగిందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. మంగళవారం ఆయన అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బిజెపి నేతలపై ధ్వజమెత్తారు.
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ఎపి ప్రభుత్వం రూట్ మ్యాప్ వేస్తోంటే బీజేపీ నేతలు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యంగా బిజెపి ఎంపి జివిఎల్ ఎపి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. అమరావతి బాండ్ల జారీతో రాష్ట్ర ప్రతిష్ట పెరిగిందే తప్ప దిగజారలేదని ఆయన స్పష్టం చేశారు.
బిజెపి నేతలు ఆరోపిస్తున్నట్లు పార్టీకి బాండ్ల నిధులను ఎలా మళ్లిస్తారో వాళ్లే చెప్పాలన్నారు. ప్రధాని మోడీ కేంద్ర నిధులను బీజేపీకి మళ్లిస్తున్నారా..? అని కుటుంబరావు బిజెపి నేతలను ప్రశ్నించారు. బిహార్లో శ్రీజం స్కామ్ జరుగుతోందని కుటుంబరావు ఆరోపించారు. ప్రభుత్వ నిధులను ప్రైవేటు వ్యక్తుల ఖాతాలకు మళ్లించి...తిరిగి ప్రభుత్వ ఖాతాలకు తేవడమే శ్రీజం స్కామ్ అని కుటుంబరావు వివరించారు.
ఇప్పుడు బిహార్ ఆర్ధిక మంత్రిగా బీజేపీకి చెందిన సుశీల్ మోడీనే ఉన్నారని, ఈ స్కామ్లో ఆయన కీలకపాత్ర వహించారని కుటుంబరావు ఆరోపించారు. రాఫెల్ స్కామ్ తో మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ మదుపర్లు భయపడుతున్నారని కుటుంబరావు విమర్శించారు.
అంతకుముందు ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ టిడిపి నేతలపై విమర్శల వర్షం కురిపించారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు బీజేపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కడం హాస్యాస్పదమని యనమల ఎద్దేవా చేశారు. కేంద్రం సవ్యంగా సహకరిస్తే రాష్ట్రానికి ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని యనమల ప్రశ్నించారు.
కేంద్రం సహకరించనందువల్లే ఎపి ప్రభుత్వం సొంతంగా నిధులను సమీకరించాల్సి వస్తోందని తెలిపారు. దీంతో బిజెపి నేతలు ప్రజలకు సమాధానం చెప్పలేకే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తోందని ఆయన విమర్శించారు. అమరావతి నిర్మాణానికి రూ.40వేల కోట్లు కావాలని డీపీఆర్ ఇస్తే...కేంద్రం కేవలం రూ.1500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని యనమల దుయ్యబట్టారు.