అవి చెప్పలేం!: చంద్రబాబు-లోకేష్ విదేశీ ఖర్చు వివరాలు ఇచ్చేందుకు నో
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ విదేశీ ప్రయాణాలకు సంబంధించిన వివరాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఇందుకు సంబంధించిన వివరాలు అడగగా.. ఆర్టీఐ యాక్ట్ 2005 ప్రకారం వివరాలు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ యాక్ట్ ప్రకారం ప్రజా సంబంధ అంశంగా సంబంధిత అధికారి భావిస్తే వివరాలు ఇస్తారు.
చదవండి: 'ఇలా మాట్లాడుతున్నారేంటి... పవన్ వ్యాఖ్యలతో జనసేన సభకు వెళ్లిన వాళ్లూ విస్మయం'
నాగార్జున రెడ్డి అనే ఆర్టీఐ కార్యకర్త చీఫ్ సెక్రటరీ కార్యాలయం నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కావాలని కోరారు. ఆరు పాయింట్లు అందులో పొందుపరిచారు. చంద్రబాబు, లోకేష్ల విదేశీ ప్రయాణం, అందుకు సంబంధించిన ఖర్చు వివరాలు అడిగారు. విదేశాల్లో వారు ఆహారం, నీరు తదితర రోజువారీ ఖర్చుల వివరాలు కోరారు.
చదవండి: ఖబడ్దార్: బాబు, ఇలాంటి సభలో పాల్గొనాల్సి వస్తుందనుకోలేదు: కోనేరు హంపి
వీటి వివరాలు ఆడిగారు
అలాగే, సీఎం చంద్రబాబు అధికారిక నివాసం ఖర్చు, గత నాలుగేళ్లలో అధికారికంగా నిర్వహించిన విందులకు అయిన ఖర్చు, 2014కు చెందిన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో వివరాలు మరియు అమలైన అంశాలు, సీఎంతో పాటు అతని కుటుంబ సెక్యూరిటీ ఖర్చు తదితర వివరాలు కావాలని సమాచార హక్కు చట్టం ద్వారా కోరారు.
విదేశీ ఖర్చులపై ఇలా చేయాలని సూచన
ఆర్టీఐ ద్వారా కోరిన ఈ వివరాలపై పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి (పీఐవో) స్పందించారు. మీరు చేసిన దరఖాస్తును ఆర్టీఐ యాక్ట్ 2005 సెక్షన్ 8 (1) (ఈ) ప్రకారం తిరస్కరించబడినదని పేర్కొన్నారు. దీనిపై ఆర్టీఐ కార్యకర్త తదుపరి అప్పిలేట్ అథారటీని సంప్రదించగా.. విదేశీ ప్రయాణ ఖర్చులపై ప్రభుత్వ వెబ్ సైట్లో చూసుకోవచ్చునని వెల్లడించారు.
ఎందుకు తిరస్కరించారో అర్థం కావట్లేదు
తన దరఖాస్తును తిరస్కరించడంపై ఆర్టీఐ కార్యకర్త స్పందిస్తూ.. నా దరఖాస్తును ఎందుకు తిరస్కరించారో అర్థం కావడం లేదన్నారు. ఆ ఖర్చు అంతా ప్రజల సొమ్ము అని, కాబట్టి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినప్పుడు వివరాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. తనకు వివరాలు ఇవ్వనందున సంబంధిత కోర్టును తాను ఆశ్రయిస్తానని వెల్లడించారు.
నేను అడిగినా ఇవ్వలేదు
ఈ అంశంపై వైసీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. సీఎం ఎక్కడకు వెళ్లినా ఛార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తున్నారని, ఈ ఖర్చు ప్రభుత్వం ఖజానా నుంచి చెల్లించకుంటే ఎవరు ఇస్తున్నారని ప్రశ్నించారు. పీఏసీ చైర్మన్గా తాను సీఎం విదేశీ పర్యటనలపై వివరాలు అడిగానని, కానీ ఇప్పటి వరకు వివరాలు అందించలేదన్నారు. ప్రజాధనం ఎలా ఖర్చు అవుతుందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు.