ఈబిల్లుతో విభజన చేయలేరు, కక్షతో రాసినట్లు: నాదెండ్ల
హైదరాబాద్: ఇప్పుడు వచ్చిన తెలంగాణ ముసాయిదా బిల్లుతో రాష్ట్ర విభజన చేయలేరని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు బుధవారం అన్నారు. రాష్ట్ర విభజన అంశంపై ఆయన స్పందించారు. తాను విశాలాంధ్రవాదినని, విభజన బిల్లును ఎవరో కావాలని కక్షతో రాసినట్లుగా ఉందన్నారు.
బిల్లులో చాలా తప్పులు ఉన్నాయన్నారు. బిల్లును చాలా నిర్లక్ష్యంగా రూపొందించారన్నారు. తెలంగాణ బదులు తమిళనాడు అని రాశారని విమర్శించారు. బిల్లును చూస్తుంటే అధికార వ్యవస్థ ఇంతలా దిగజారిందా అని ఆవేదన కలుగుతోందన్నారు. ఎవరిని బాగు చేయడానికి రాష్ట్రాన్ని విభజిస్తున్నారో చెప్పాలన్నారు.
చంద్రబాబుపై ఆగ్రహం
నారా చంద్రబాబు నాయుడు తాను ప్రారంభించిన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారని, ఆయనకు తనపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదన్నారు. తన కుమారుడు నాదెండ్ల మనోహర్ పైన కూడా ఆరోపణలు చేసే అర్హత లేదన్నారు. స్పీకర్ అనే వాడు రాజ్యాంగానికి బద్దుడన్నారు.
సభాపతిని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులు స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కలిశారు. సభ సజావుగా సాగేలా చూడాలని కోరారు. మరోవైపు అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చను నిరసిస్తూ సమైక్యవాదులు అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని మారుతి గార్డెన్స్ వద్ద అడ్డుకున్నారు.
శాసన మండలి రేపటికి వాయిదా
విభజన బిల్లుపై ఎలాంటి చర్చ జరగకుండానే శాసన మండలి గురువారానికి వాయిదా పడింది. సమైక్య తీర్మానం చేయాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలు, బిల్లుపై చర్చించాలని తెలంగాణ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. దీంతో చైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు.