వీడిన మిస్టరీ .... సవతి తల్లే దారుణంగా హతమార్చి.. ఉప్పుటేరులో పడేసి... ఆపై
తూర్పుగోదావరి జిల్లాలో దీప్తీశ్రీ మిస్సింగ్ మిస్టరీ ఎట్టకేలకు వీడింది . చిన్నారిని సవతి తల్లి దారుణంగా చంపి ఉప్పుటేరులో పడేసినట్లు సవతి తల్లి శాంతి కుమారి ఒప్పుకోవడం తో పోలీసులు దీప్తిశ్రీ మృతదేహం కోసం ఉప్పుటేరు లో గాలింపు ముమ్మరం చేశారు. తన కుమారుడి కంటే, దీప్తి శ్రీని ఎక్కువ ప్రేమగా భర్త చూస్తున్నాడన్న కోపంతోనే దీప్తి శ్రీని సవతి తల్లి హతమార్చినట్టు తేలింది.
చిన్నారిని హత్య చేసిన సవతి తల్లి..! దీప్తిశ్రీ కేసులో విషాదం : రంగంలోకి ధర్మాడి సత్యం టీం..!
దీప్తి శ్రీ ని హతమార్చింది సవతి తల్లి శాంతి కుమారి
కాకినాడలో నేతాజీ నగర్లోని గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న దీప్తిశ్రీ శుక్రవారం మధ్యాహ్నం కిడ్నాప్ కు గురైంది. సాయంత్రం ఆమె ఇంటికి రాకపోవడంతో దీప్తిశ్రీ కిడ్నాప్ అయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీప్తిశ్రీ తండ్రి. కిడ్నాప్ వ్యవహరంలో సవతి తల్లి శాంతికుమారి ప్రమేయం ఉందని అనుమానించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా తీగ లాగితే డొంకంతా కదిలింది. విచారణలో సవతి తల్లి హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం.
దీప్తి శ్రీ మృతదేహం కోసం రంగంలోకి ధర్మాడి సత్యం టీమ్
దీప్తి శ్రీని హతమార్చి, ఉప్పుటేరు లో పడేసినట్టు సవతి తల్లి ఒప్పుకోవడంతో దీప్తిశ్రీ ఆచూకీ కోసం గాలించేందుకు ధర్మాడి సత్యం టీమ్ను రంగంలోకి దించారు.. మొత్తం 15మంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పడవల సాయంతో ధర్మాడి సత్యం టీమ్ దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలిస్తున్నారు.. పోలీసులు దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
దీప్తి శ్రీ పై భర్త ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడన్న అసూయతో ఘాతుకం
ఇక ఈ కేసులో అసలు విషయానికి వస్తే కాకినాడ పగడాల పేటకు చెందిన సత్య శ్యాం కుమార్,సత్యవేణి దంపతులకు పుట్టిన పాప దీప్తిశ్రీ. సత్యవేణి అనారోగ్యంతో చనిపోవడంతో శ్యాం కుమార్ రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక వారికి ఒక బాబు పుట్టాడు. ప్రస్తుతం బాబు వయసు 13 నెలలు. అయితే శ్యాం కుమార్ దీప్తిశ్రీ పైనే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారని భావించి సవతి తల్లి దీప్తిశ్రీ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం తీసుకుంది.
తనకు , తన కుమారుడికి దీప్తిశ్రీ అడ్డు అని భావించిన సవతితల్లి
అంతేకాదు పలుమార్లు దీప్తిశ్రీ ని చిత్ర హింసలు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఒకానొక సందర్భంలో తండ్రి శ్యాం కుమార్ బాలిక ఒంటిపై వాతలు చూసి శాంతి కుమారిని నిలదీశారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కోపం పెంచుకున్న సవతితల్లి,ఆ బాలిక పాలిట యమదూతలా మారింది. చివరకు మరణశాసనం రాసింది. ఇక తనను, తన కుమారుడిని దీప్తిశ్రీ ఉంటే భర్త నిర్లక్ష్యంగా చూస్తాడని భావించిన శాంతి కుమారి మధ్యాహ్న సమయంలో స్కూల్ నుంచి తీసుకువెళ్లి మరీ హతమార్చింది.
సీసీ టీవీ ఫుటేజ్ ల ఆధారంగా సవతి తల్లి గుట్టు రట్టు
అయితే స్కూల్ నుండి దీప్తి శ్రీని తీసుకువెళ్లిన మహిళ ముఖానికి ముసుగు వేసుకోవడం తో పోలీసులు ముందు ఆమెను గుర్తించలేకపోయారు. సీసీటీవీ ఫుటేజీలను ఆధారంగా చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు దీప్తిశ్రీ తండ్రి సత్య శ్యామ్ కుమార్ ఫిర్యాదు మేరకు, సవతి తల్లి శాంతికుమారిపై అనుమానంతో విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. పాపను దారుణంగా హతమార్చి ఇంద్రపాలెం లాకుల వద్ద ఉప్పుటేరు లో పడేసినట్లుగా ఆమె ఒప్పుకుంది.
శాంతి కుమారికి ఎవరు సహకరించారనే దానిపై పోలీసుల దర్యాప్తు
మధ్యాహ్నం ఒంటిగంటకు స్కూల్ నుండి తీసుకువెళ్లిన శాంతి కుమారి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మృతదేహాన్ని మూటకట్టి ఇంద్ర పాలెం వద్ద ఉప్పుటేరు లో పడేసింది. ఈ రెండు గంటల సమయంలో శాంతి కుమారి ఎక్కడికి వెళ్లింది,ఏం చేసింది,ఆమెకు సహకరించిన వారు ఎవరు? ఎవరి ప్రమేయం లేకుండా ఒక్కతే ఈ ఘాతుకానికి పాల్పడే అవకాశం లేదని భావిస్తున్న పోలీసులు, అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు శాంతి కుమారి ఈ ఘాతుకానికి పాల్పడటానికి మరేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఉప్పుటేరు లో దీప్తిశ్రీ కోసం గాలిస్తున్నారు.