'హోదా'పై నిరసనలు: మోడీ దిష్టిబొమ్మ దగ్ధం, 'మోడీ, బాబు జోడి.. ఏపీకి బోడీ' (ఫోటోలు)
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి హాజరైన ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఎటువంటి ప్రకటనా చేయకపోవడంపై ఉత్తరాంధ్రలో శుక్రవారం భారీగా నిరసన కార్యక్రమాలు జరిగాయి.
ప్రధాని నరేంద్రమోడీ వస్తారని.. ప్రత్యేక హోదా ప్రకటిస్తారని.. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్యాకేజి వస్తుందని రాష్ట్ర ప్రజానీకం ఎంతో ఆశతో ఎదురుచూశారు. విజయదశమి రోజున శుభవార్త వింటామని అందరూ అనుకున్నారు. అయితే ఢిల్లీనుంచి తెచ్చిన మట్టి, యమునా నది నీళ్లు తప్ప ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు ఒరిగిందేమీ లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ఒకపక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు, నిరసనలు కొనసాగుతుండగా, మరోపక్క శుక్రవారం వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రత్యేక హోదా విషయంలో మోడీ ఏపీ ప్రజలకు అన్యాయం చేశారని విపక్షాలు ఆరోపించాయి.
విశాఖ నగరం, జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, పాడేరు, పాయకరావుపేట, తదితర ప్రాంతాల్లో రాస్తారోకోలు నిర్వహించి, ప్రధాని మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. విశాఖ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. విజయనగరం జిల్లాలో పలుచోట్ల రాస్తారోకోలు నిర్వహించారు.
తిరుపతిలో శుక్రవారం సిపిఎం, సిపిఐ, రాయలసీమ పోరాట సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేశారు. 'మోడీ, బాబు జోడి.. ఏపీకి బోడీ' అంటూ నినాదాలు చేశారు.
'హోదా'పై నిరసనలు: మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి నరేద్రమోడీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాగానీ, మరే ఇతర వరాలనుగానీ ప్రకటించకపోవటం పట్ల గోదావరి జిల్లాల్లో అన్ని వర్గాలు ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తంచేసారు.
'హోదా'పై నిరసనలు: మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
వైసీపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలతో పాటు మాలమహానాడు ఆధ్వర్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో చాలా చోట్ల శుక్రవారం నిరసన ప్రదనర్శనలు జరిగాయి. ప్రధాని ప్రసంగంలో ప్రత్యేక హోదాపై ప్రస్తావించకపోవడాన్ని నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
'హోదా'పై నిరసనలు: మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జగ్గంపేటలో భారీ ర్యాలీ జరిగింది. చంద్రబాబు, మోడీల తీరును నిరసిస్తూ ‘ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు' అంటూ నినదించారు. జగ్గంపేట మెయిన్రోడ్ నుంచి పంచాయితీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు.
'హోదా'పై నిరసనలు: మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
అనంతరం గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల మాట్లాడుతూ ప్రత్యేక హోదా ప్రకటనపై వేయికళ్లతో ఎదురు చూస్తే ప్రధాని ప్రజల నోట్లో మట్టికొట్టారని, సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో హోదా ప్రస్తావన కూడా తేలేదని విమర్శించారు.
'హోదా'పై నిరసనలు: మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
విజయవాడలో ప్రధాని అనుకూల ప్రకటన చేయగలరని ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్న ప్రజల ఆశలపై కిలో మట్టి, చెంబుడు నీళ్లు చల్లిపోయాడంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసనసభ్యుడు రామకృష్ణ నిప్పులు చెరిగారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్, సిపిఎం, వైసీపీ, సిపిఐ పక్షాల నేతృత్వంలో వేర్వేరుగా విజయవాడ నగరంలో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి.
'హోదా'పై నిరసనలు: మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ ఏపికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీపై ఎలాంటి ప్రకటన చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశారంటూ చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విపక్షాలు నిరసన తెలిపాయి. చిత్తూరు జిల్లాలో తిరుపతి సహా పలుచోట్ల కాంగ్రెస్, వైసీపీ, జై సమైక్యాంధ్ర, వామపక్షాలు నిరసనలు వ్యక్తం చేశాయి.
'హోదా'పై నిరసనలు: మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
అమరావతి శంకుస్థాపన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక హోదాపై నోరు మెదపకపోవడాన్ని నిరసిస్తూ రాయలసీమ జిల్లాల్లో శుక్రవారం నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి. కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రధాని, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.
'హోదా'పై నిరసనలు: మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
పలుచోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురం జిల్లాలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వైసీపీ శ్రేణులు పలుచోట్ల దిష్టిబొమ్మలు తగులబెట్టాయి. వైసీపీ శ్రేణులు అనంతపురం ఆర్డిఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాయి. హిందూపురం, కదిరి, ధర్మవరం, గుంతకల్లు తదితర ప్రాంతాల్లో ప్రధాని, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.
'హోదా'పై నిరసనలు: మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
కర్నూలు జిల్లాలో సైతం నిరసనలు మిన్నంటాయి. కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్ తదతర ప్రాంతాల్లో ప్రధాని మోడీ, చంద్రబాబు దిష్టిబొమ్మలు తగులబెట్టారు. వైకాపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కడప జిల్లాలో ప్రధాని, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.
'హోదా'పై నిరసనలు: మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
మోడీ పర్యటన ఢిల్లీలో మట్టి తెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొట్టి, నీళ్లు చల్లినట్లుగా ఉందని కొంతమంది వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ చేపట్టిన పోరుబాటలో మునికోటి తిరుపతిలోనే ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. రాయలసీమ అభివృద్ధి ఉద్యమ వేదిక కన్వీనర్గా గేయానంద్ ఆధ్వర్యంలో దశలవారీగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి.
'హోదా'పై నిరసనలు: మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
రాయలసీమ పోరాట సమితి ఆధ్వర్యంలో 'మోడీ, బాబు జోడి.. ఏపీ ప్రజలకు బోడీ' అంటూ ఆందోళన చేపట్టారు. సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కందారపు మురళి ఆధ్వర్యంలో శిరోముండన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పాల్గని మద్దతు ప్రకటించారు.