వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి: అమిత్ షాపై దాడి ఘటనపై చంద్రబాబు ఆగ్రహం
అమరావతి/చిత్తూరు: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని తిరిగి వెళ్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాపై దాడి విమర్శలకు తావిస్తోంది. దైవదర్శనానికి వచ్చిన వారిపై దాడి ఏమిటని మండిపడుతున్నారు. నిరసన తెలిపే హక్కు ఉందని, కానీ దాడి సరికాదంటున్నారు. ఈ ఘటనలో బీజేపీ నేతలు.. సీఎం చంద్రబాబు వైపు వేళ్లు చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. దాడికి పాల్పడింది తమవారు కాకపోవచ్చునని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. కానీ అక్కడ నిరసన తెలిపింది టీడీపీ వారే. ప్రత్యేక హోదా ఉద్యమం చేస్తున్నారా లేక వాహనలపై దాడులు చేస్తున్నారా అని బీజేపీ ప్రశ్నిస్తోంది. దాడి చేసిన వారు తమ వారు కాదని టీడీపీ నేతలు అంటుంటే చంద్రబాబు మరో ముందడుగు వేశారు.
టీడీపీ వారు ఉంటే సస్పెండ్ చేయండి
అమిత్ షాపై జరిగిన దాడిని చంద్రబాబు ఇప్పటికే ఖండించారు. దాడి చేసిన వారిలో టీడీపీ నేతలు ఉంటే వారిని వెంటనే సస్పెండ్ చేయాలని పార్టీ రాష్ట్ర నేతలకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షా కాన్వాయ్ని అడ్డుకొని, ఆందోళన చేయడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. అలా ప్రవర్తించిన వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నియమాలకు కట్టుబడి ఉండాలని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
ఉద్యమంలో హింసకు తావులేదు
ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా ఉద్యమం చేద్దామని చంద్రబాబు నేతలకు సూచించారు. హోదా కోసం జరిగే ఉద్యమంలో విధ్వంసానికి తావు లేదన్నారు. ఇలాంటి వాటిని సహించేది లేదన్నారు. ఇందులో భాగంగానే అమిత్ షాపై దాడి చేసిన వారిలో మన పార్టీ వారు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలిసీ తెలియని ప్రవర్తనతో పార్టీకి చెడ్డపేరు తీసుకురావొద్దని, ఏ సమయానికి ఎలా స్పందిచాలనేది అందరూ తెలుసుకోవాలన్నారు.
దాడిని ఖండించిన చలసాని శ్రీనివాస్
అమిత్ షా కారుపై దాడి చేయడాన్ని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ ఖండించారు. దైవదర్శనానికి వచ్చినప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. వ్యక్తిగత పనులపై వచ్చినప్పుడు అడ్డుకోవడం పద్ధతి కాదన్నారు. అలాగే బీజేపీపై కూడా ఆయన మండిపడ్డారు. విజయవాడలో విద్యార్థులపై దాడి చేయించిన బీజేపీకి ఇప్పుడు ఖండించే అర్హత ఉందో లేదో ఆలోచించుకోవాలన్ననారు. మా ఉద్యమం వల్ల కేంద్రం ఏపీకి ఎంతో కొంత ఇచ్చిందన్నారు.
చంద్రబాబు వీసా తీసుకోవాలా?
తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకోవాలంటే చంద్రబాబు వీసా తీసుకోవాలా అని బీజేపీ ఐటీ ఇంచార్జ్ సత్యమూర్తి విమర్శించారు. దాడి సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారన్నారు. కాగా, తిరుమలలో అమిత్ షా కారును కొందరు టీడీపీ వారు అడ్డుకొని దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇది దుమారం రేపుతోంది.