గ్రామ వాలంటీర్ల ఎంపిక ఆపండి ...జీవో 104ను నిలిపివేయండి ... హైకోర్టులో పిల్
ఇప్పుడు జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పధకాలు ప్రజల దగ్గరకి నేరుగా చేరాలనే ఉద్దేశంతో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించింది . ఇందులో మొదటి నుండే పెద్ద ఎత్తున అవినీతి,అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ నేపధ్యంలో ఏపీ హైకోర్టులో ఈ వ్యవహారానికి సంబంధించి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది.
ప్రతిభ ఆధారంగా గ్రామ వాలంటీర్ల ఎంపిక జరగాలని పిల్ వేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు
ప్రభుత్వ సేవలను ఇంటింటికి చేరవేసేందుకు ఏపీ ప్రభుత్వం దాదాపు 4 లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమించేందుకు కసరత్తు చేస్తోంది . ఇందుకోసం ఇప్పటికే ఇంటర్వ్యూల ప్రక్రియ కూడా ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో గ్రామ వాలంటీర్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియపై ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ పిల్ దాఖలు చేశారు. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే కాకుండా ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏపీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేశ్ రెడ్డి ఈ పిల్ వేశారు.
ఇక ఈ పోస్ట్ లకు అభ్యర్థుల విద్యార్హత ఆధారంగా వెయిటేజ్ మార్కులు ఇవ్వాలనిఆ పిటీషన్ లో కోరారు . వాలంటీర్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం జారీచేసిన జీవో 104 లోపభూయిష్టంగా ఉందనీ, దీన్ని వెంటనే నిలుపుదల చేయాలని కోర్టుకు విన్నవించారు. ఈ నెల 11 నుంచి 25 వరకూ మండల పరిషత్ కార్యాలయాల్లో గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూలు జరగనున్నాయి.ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 1న నియామక పత్రాలు అందజేస్తారు. వీరికి ఆగస్టు 5 నుంచి 10 వరకు పలు అంశాల్లో శిక్షణ ఇస్తారు. అనంతరం స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15న బాధ్యతలు అప్పగిస్తారు.
Recommended Video
లోపభూయిష్టంగా ఎంపిక ప్రక్రియ .. జీవో 104 అంతా తప్పుల తడక అని పిల్
గ్రామ స్థాయి నుండి అందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా ప్రతీ 50 ఇళ్లకు ఓ గ్రామ వాలంటీర్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.కులం,పార్టీలతో సంబంధం లేకుండా అర్హత కలిగిన వాళ్ళకి వాలంటీర్ పోస్ట్ ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక అర్హత ఉన్న ప్రతి ఒక్కరు గ్రామాల్లోని నిరుద్యోగులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇక్కడ అర్హత అనే విషయాన్ని పక్కన పెట్టేసి కేవలం వైసీపీ సానుభూతి పరులకే ఇంటర్వ్యూలు నిర్వహించి గ్రామ వాలంటీర్లుగా అవకాశం ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి . ఇక గ్రామ వాలంటీర్ పోస్టులు కోసం ఎమ్మెల్యే ఆఫీస్ చుట్టూ పెద్ద ఎత్తున తిరుగుతున్నారని సమాచారం . అందుకు తగ్గట్లే స్థానిక ఎమ్మెల్యే రికమండేషన్ తో పోస్టులు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జీవో 104 అంతా తప్పుల తడకలా ఉండటంతో దానిని నిలిపివేయాలని సైతం పిటీషన్ లో పేర్కొన్నారు.
హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం .. కోర్టు ఏం చెప్తుందో
గ్రామ వాలంటీర్ పోస్ట్ కోసం దరఖాస్తులు చేసిన అభ్యర్థులు ఎంపిక ప్రతిభ ఆధారంగా, విద్యార్హతలను కూడా చూసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పార్టీ వాళ్ళకే ఇచ్చేటట్లైతే డైరెక్ట్ గా ఇచ్చుకోవచ్చు కదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలో హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి నెలకొంది.