అల్లకల్లోలంగా కాశ్మీర్: బిక్కుబిక్కుమంటూ తెలుగువాళ్లు, నీళ్ల బాటిల్ రూ.60
శ్రీనగర్: హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వాని కాల్చివేత నేపథ్యంలో కాశ్మీర్ అట్టుడుకుతోంది. తాజా అల్లర్లలో ఓ పోలీసు సహా ఆరుగురు మృతి చెందారు. నలుగురు ఆసుపత్రిలో ఆదివారం ప్రాణాలు విడిచారు. దీంతో అల్లర్లలో మృతి చెందిన వారి సంఖ్య 21కి చేరింది. మరో 200 మంది గాయపడ్డారు.
శ్రీనగర్, దక్షిణ కాశ్మీర్లోని నాలుగు జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ తరహా నియంత్రణలను అధికారులు కొనసాగిస్తున్నారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కాశ్మీర్ పరిణామాలను కేంద్రం పరిశీలిస్తోంది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సిఎం ముఫ్తీతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.
కాశ్మీర్లో చిక్కుకున్న తెలుగోళ్లు: హీరోలా.. ఎవరీ 'టెర్రరిస్ట్' బుర్హాన్?
అనంత్ నాగ్ జిల్లాలో ఆందోళనకారులు పోలీసు వాహనాన్ని జీలం నదిలోకి తోసివేశారు. దీంతో, పోలీసు డ్రైవర్ మృతి చెందాడు. శనివారం రాత్రి పుల్వామా ట్రాల్ ప్రాంతంలో ఓ హెడ్ కానిస్టేబుల్ ఇంటి పైన తీవ్రవాదులు దాడి చేశారు. వారు జరిపిన కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. పీడీపీ ఎమ్మెల్యే నివాసం, బీజేపీ కార్యాలయం వద్ద ఆందోళనకారులు గందరగోళం సృష్టించారు.
తెలుగు యాత్రికుల ఇబ్బందులు
ఉద్రిక్తత నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర రెండో రోజు కూడా నిలిపివేశారు. అమర్నాథ్ యాత్ర చేపట్టిన వందలాది మంది తెలుగు యాత్రికులు కశ్మీర్ లోయలోని వివిధ ప్రాంతాల్లో ఇరుక్కుపోయారు. బుర్హాన్ వాని ఎన్కౌంటర్ నేపథ్యంలో అల్లర్లు చెలరేగడంతో శ్రీనగర్లో కర్ఫ్యూ విధించి యాత్రికులను ఎక్కడికక్కడే ఆపివేశారు.
శ్రీనగర్ నుంచి బయటి ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వివిధ జిల్లాలకు చెందిన భక్తులు పలు షెల్టర్లలో బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రంగంలోకి దిగి జమ్మూకశ్మీర్ అధికారులతో నిరంతరం సంప్రదిస్తున్నారు.
వారిని క్షేమంగా రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. తెలుగు యాత్రీకులు అందరూ క్షేమంగా ఉన్నారు. అమర్నాథ్లో మంచులింగాన్ని దర్శనం చేసుకొని తిరిగి వస్తున్న సమయంలో శ్రీనగర్లో కర్ఫ్యూ విధించడంతో భక్తులకు ఇబ్బందులు మొదలయ్యాయి.
ఏపీలోని అనంతపురం, పశ్చిమగోదావరి, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన భక్తులు తమ పరిస్థితుల గురించి తమ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఏకరువు పెట్టడంతో వారు ఏపీ వన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ దృష్టికి విషయాన్ని తీసుకొచ్చారు.
కజికిస్థాన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడి నుంచే సంబంధిత అధికారులతో మాట్లాడారు. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్పీకర్ కోడెల శివప్రసాద రావు, మంత్రి శిద్ధా రాఘవరావు, ఏలూరు ఎంపీ మాగంటి బాబు తమ జిల్లాలకు చెందిన భక్తుల ఫోన్ నెంబర్లు ఏపీ భవన్ అధికారులకు ఇచ్చి వారితో మాట్లాడించారు.
ఆదివారం ఉదయం 7.30 గంటల నుంచి శ్రీకాంత్ ఇదే అంశంపై జమ్మూకశ్మీర్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ అక్కడి తెలుగువారి రక్షణ, ఆహారానికి ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
బుర్హాన్ కాల్చివేత: అట్టుడికిన కాశ్మీర్, బీజేపీ ఆఫీస్పై దాడి
ఏపీ భక్తులు పహల్గావ్, భల్తాల్, శ్రీనగర్లో ఇరుక్కుపోయారని, అంతా దైవదర్శనం చేసుకొని కిందకు వస్తున్నారని, పహల్గావ్ అసిస్టెంట్ కమాండెంట్ ప్రశంత్సింగ్తో మేం సంప్రదింపులు జరుపుతున్నామని, అక్కడున్న సుమారు 45 మందిని హోటల్లో ఉంచారని శ్రీకాంత్ చెప్పారు.
అంతా పోలీస్ రక్షణలో సురక్షితంగానే ఉన్నారని, బల్తాల్లో 250 మంది దాకా ఉన్నారని, ఆ జిల్లా ఎస్పీ ఇంతియాజ్తో మాట్లాడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకున్నామని, శ్రీనగర్ దారిలో భక్తులపై దాడి చేయొచ్చని నిఘావర్గాలకు సమాచారం అందిందని చెప్పారు.
ఆదివారం రాత్రి పరిస్థితి సమీక్షించి సీఆర్పీఫ్ రక్షణలో యాత్రికులను జమ్మూకి తీసుకురావాలని భావిస్తున్నారని, ఇక శ్రీనగర్, పరీచౌక్, జహింగిర్ చౌక్లో 250 మందిదాకా ఉన్నారని, వీరి బస్సులను సైన్యం స్వాధీనం చేసుకుందని చెప్పారు.
జమ్మూకు వచ్చే దారిలో 60 కిలోమీటర్ల మేర కొంత అవాంఛనీయ పరిస్థితులున్నాయని, కర్ఫ్యూ వల్ల దుకాణాలు మూతపడటంతో ఆహారానికీ ఇబ్బంది ఉందని, బిసెట్లు, నీళ్లు మాత్రమే ఇస్తున్నారని, కార్గిల్ నుంచి బల్తాల్కు ఆహారపదార్థాలు తరలిస్తున్నారని, అక్కడ సుమారు 40వేల మంది ఉన్నారని శ్రీకాంత్ చెప్పారు.
గుంటూరు నుంచి 40-50, నర్సరావుపేట నుంచి 40, అనంతపురం నుంచి 50, ప్రకాశం నుంచి 200, నెల్లూరు 50-60 మంది భక్తులు అక్కడ ఉన్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్లిన యాత్రికుల్లో 25 మంది శ్రీనగర్లో చిక్కుకున్నట్లు చెప్పారు. మరో 15 మంది ఖట్రాలో ఉన్నారన్నారు. అందరు సురక్షితంగానే ఉన్నారు.
కాగా, పలు ప్రాంతాల్లో తలదాచుకున్న తెలుగు వారికి నీరు, ఆహారం దొరకడం ఇబ్బందిగా మారింది. వాటర్ బాటిల్ ధర రూ.60 నుంచి అంతకంటే ఎక్కువగా పలుకుతోంది. ఎక్కడైనా ఉండాలంటే వేలాది రూపాయలు కావాల్సి వస్తుందని తెలుస్తోంది. కొన్ని ధార్మిక సంస్థలు పెడుతున్న భోజనం తిని కడుపు నింపుకుంటున్నారు.
మరోవైపు, తెలంగాణకు చెందిన మహబూబ్నగర్ జిల్లా వాసులు 82 మంది కశ్మీర్ లోయలోని బల్తాల్ ప్రాంతంలో రెండు రోజులుగా చిక్కుకుపోయారు. వారంతా జడ్చర్ల, దేవరకద్ర, గద్వాలకు చెందిన వారు. తెలుగు యాత్రికుల సంక్షేమం కోసం ఏపీ డీజీపీ జేవీ రాముడు జమ్మూకాశ్మీర్ డీజీపీతో, తెలంగాణ ఇంచార్జ్ డీజీపీ అంజనీకుమార్ ఆదివారం ఆ రాష్ట్ర అదనపు డీజీ (శాంతిభద్రతలు) ఎస్ఎం సహాయ్తో మాట్లాడారు.
ప్రస్తుతం బల్తాల్ బేస్క్యాంపులో వివిధ రాష్ట్రాలకు చెందిన 10వేలకు పైగా యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. అమర్నాథ్ యాత్రికులు క్షేమంగా ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. యాత్రికులకు ఎలాంటి ప్రమాదం లేదని, సౌకర్యాలు కల్పనపై అక్కడి ప్రభుత్వంతో మాట్లాడినట్లు చెప్పారు.